|
|
Articles: My Thoughts | షడంగాల నెలవు - Site Administrator
| |
ఈ శతాబ్దంలో, వచన రచనకు పెట్టినది పేరు... ఒక్క ఇద్దరికే... శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటాశాస్త్రిగారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారూ! వేంకటశాస్త్రిగారు కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు, సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కథలుగా ఎన్నో కబుర్లు చెప్పారు.
ఇద్దరూ విన నేర్పున్నవారు
చెప్పే తీరు వారికే చేతనౌ!
వారి వచనము తెలుగువారికి, తెలుగు తనానికి నారాయణ కవచము! వేంకటశాస్త్రి గారి వచనము చదవకపోతే, తెలుగువారికి తెలుగురాదు! శ్రీపాదవారి కథలు విని వుండకపోతే - తెలుగుల ఉనికి అయోమయం.
సుబ్రహ్మణ్యశాస్త్రిగారు జగము ఎరిగినవాడు, జగము తన్నెరిగిన వాడు.
మరిన్నీ... విశేషించి... బ్రాహ్మణుడు, అనగా బ్రాహ్మణీకమే ఆయన రచన, గోదావరీ మండలంలో వెలనాటి వైదిక కుటుంబాలు, ఆయన సాహితీ సమరాంగణము. వారి పోకడలూ, మెలకువలూ ఆయన వాక్యములు.
వారి కష్టసుఖాలు, ఆయన చెప్పిన కథలు.
సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కథలు... కొన్నైనా చదివితే...
తెలుగు కుటుంబాల ఆపేక్ష... అంత:కరణలు ఎలాటివో... ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమౌతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచ్చటౌతుంది!
'వడ్లగింజలు'... మించే కథ ఉందా!
'యిల్లు పట్టిన వెధవాడపడచు'...అలా మరొకరు రాయగలిగేరా?
'అనుభవాలూ - జ్ఞాపకాలూ'... నూరేండ్ల తెలుగుతనపు కూలంకష - క్రోడీకరణ కాదా!... అది వేయేళ్ళ పాటు, పదింబదిగ చదువుకోవలసిన గ్రంథం కాదా? తెలుగు మాగాణముతో బాటు, మీగడ తరకలైన శ్రీ శాస్త్రిగారి రచనలు శాశ్వతముగా వర్థిల్లవా!
శ్రీ పాదవారిలో పండితులున్నారు, కవులున్నారు, వైద్యులున్నారు, వర్తకులున్నారు!
ఇక, చిరస్మరణీయులైన శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు పండితుడు, కవి, వైద్యుడు, వర్తకుడు, సరసంగా తానై, ఛాందసము వన్నె తెచ్చిన సంస్కారి, శృతిపక్వమై పట్టుదల రాణించిన వివేకి, తనకు చిననాడే చేయితిరిగినదన్న నమ్మకమూ, తాను చేసిన రచనలు లోకమును, లోకులను ఒప్పించి మెప్పించగలవన్న విశ్వాసమూ నిలువెత్తున గల నిగర్వి!
వైదిక విద్యలు ఆయన ఒంటపట్టినవి, శాస్త్ర ప్రసంగములు తరతరాలుగా వారి యింట పుట్టినవి. షడంగములూ శ్రీపాద వారి లోగిలి నెలవు!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|