|
|
Articles: Time Pass | చీకటి టూ చీకటి! - Site Administrator
| |
(పి.శివరామకృష్ణ)
కాళీపట్నం రామారావుగారి `యజ్ఞం' కథలో గ్రామానికి కరెంటు, రోడ్డు, బడి వస్తుంది. కాని దళితుడైన అప్పలరాముడికి ఉన్న కాస్తంత పొలం షావుకారు అప్పు, వడ్డీ కింద జమయింది. పొలం లేని తన కొడుకు బానిస బతుకును ఊహించుకోలేని అప్పలరాముడు కొడుకును ముక్కలుగా గోతంలో కట్టి తెచ్చి - గ్రామ పెద్దల ముందు తన ఆక్రోశం వెళ్ళగక్కుతాడు. గ్రామం అభివృద్ధి చెందితే, తను పొలం లేని కూలీగా మారవలసివచ్చింది. ఇలా ఎలా జరిగింది అని నిలదీయడం కథలో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది. అభివృద్ధి రథ చక్రాల కింద నలిగిపోయే బలహీనల ఆర్తనాదాలను వినిపించే ఇటువంటి కథలు కోకొల్లలు.
రోడ్డు, కరెంటు, బడి - ఈ మూడింటిలో బడి ఏ పాత్ర పోషిస్తుంది - వడ్డీ నియంత్రణ, రుణ మాఫీ చట్టాలు ఏదో రూపంలో గత వందేళ్ళుగా దేశం అన్ని ప్రాంతాలలో ఉన్నాయి. అప్పు కింద దళితుల పొలాలు జమ కట్టుకోరాదనే నిబంధనలు ఉన్నాయి. వీటికి బదులుగా కూలీలుగా మార్చే చదువులే బడులలో చెప్తున్నారు. సామాజిక బాధ్యత నెత్తిన వేసుకున్న మేధావులు కూడా ఈ చదువు నేర్పకుండా, పార్టీలకు వారి రాజనీతికి కొమ్ముకాస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
ప్రఖ్యాత అర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ `చైనాలో ప్రజాస్వామ్యం లేదు కాని, భూసంస్కరణలు అమలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాని - భూసంస్కరణలు అమలు జరగలేదు'. చైనాలో 1960లలో పెద్ద కరువు వచ్చింది. లక్షల సంఖ్యలో జనం, పశువులు తిండిలేక మరణించారు. అటువంటి పరిస్థితుల్లో అలా నిస్సహాయంగా ఉంటే, భారతదేశంలో `పాలకపక్షం మరుసటి ఎన్నికలలో నెగ్గదు' అంటూ వ్యాఖ్యానిస్తూంటారు. `నిర్బంధ విద్య - వనరుల పంపిణీ దారిద్ర్య నిర్మూలనకు తప్పనిసరి' అని పదేపదే చెప్పే ఆయన ఆ విద్య ఎటువంటిదో ఎప్పుడూ చర్చించలేదు. నోబెల్ బహుమతితో వచ్చిన సొమ్ముతో ఆయన `ప్రాచీ' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారానైనా మావో ప్రవేశపెట్టిన చదువును నేర్పే ప్రయత్నం చేయలేదు.
ఇటీవల ప్రపంచమంతా అలముకుంటున్న ఆర్థిక సంక్షోభం చైనాను ఎలా ప్రభావితం చేస్తున్నదీ ప్రముఖ వారపత్రిక `ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ' నవంబరు 2008లో పది వ్యాసాలు ప్రచురించింది. మావో హయాంలో భూమిని ప్రభుత్వపరం చేశారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కావలసిన భూమి కేటాయించింది. కమ్యూన్ల ద్వారా అధికోత్పత్తికి లెవీ వసూళ్ళను నిర్వహించింది. కమ్యూన్లు నిర్వహించే లెక్కడొక్కలు - భూమి కొలతలు - అధికోత్పత్తికి కావలసిన కొత్త వంగడాలను సృష్టించడం, యంత్ర పరికరాలను వాడుకోవడం, ప్రథమ చికిత్స ఇవన్నీ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా బోధించేవారు. మావో తరువాత చైనాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగంగా చేసే క్రమంలో భూమి హక్కు అంటే అమ్ముకునే / కొనుక్కునే హక్కు కల్పించారు. పాఠ్యాంశాలను పూర్తిగా మార్చి ఫ్యాక్టరీలలో ఉద్యోగాలకు తగిన విద్య ప్రవేశపెట్టారు. ఇలా చదువుకున్నవారి శ్రమశక్తి చౌకగా లభించడంతో అనేక పాశ్చాత్యదేశాలు చైనాలో పెట్టుబడి పెట్టాయి. భారతదేశంలో నేడు వివాదాస్పదంగా మారిన సెజ్ లకు (స్పెషల్ ఎకనామిక్ జోన్) శ్రీకారం చుట్టారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|