|
|
Articles: Devotion | సాయి లీలామృతం - Mr. Pratap Cherukuri Pratap
| |
ఆత్మారాముడు అనే వ్యాపారికి అతని భార్యకు ఒక్క క్షణం పడేది కాదు. ప్రతీ చిన్న విషయానికీ తగువు లాడుకుంటూ వుండేవారు. తత్ఫలితంగా మానసిక ఆందోళనలు పెరిగిపోయి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. వారికి పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు కలగలేదు. ఆత్మారాముని భార్య ఒకసారి పెద్ద తగువు పెట్టుకొని పెట్టె, బేడా సర్ధుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త ఎంత ప్రయత్నించినా తిరిగి రాలేదు. తన వైవాహిక జీవితం ఈ విధంగా విఫలమవడం ఆత్మారాముడిని క్రుంగదీస్తుండేది. ఒకసారి 1913 వ సంవత్సరం లో శిరిడీ దర్శించి మంచి అనుభవాలను పొందిన బి.వి.వైద్య అనువాడు ఆత్మారామునికి ఊదీ ప్రసాదాలను ఇచ్చి సాయిని ప్రార్ధించమని సలహా ఇచ్చాడు. ఆత్మారాముడు వెంటనే శిరిడీ దర్శించి , సాయిని ప్రార్ధించి ఆశీర్వాదం తీసుకొని తిరిగి ఇంటికి వచ్చి బంధువుల ద్వారా తీర్ధ ప్రసాదాలను భార్యకు పంపాడు. ఆ తీర్ధ ప్రసాదాలను స్వీకరించిన కొద్ది రోజులలోనే ఆమెలో మంచి మార్పు వచ్చింది. భర్తను విడిచి పుట్టింట్లో వుండడం ఎంత తప్పో ఆమెకు తెలిసి వచ్చి 'పుట్టింట్లో సుఖమేమున్నది? పెళ్ళయిన స్త్రీకి అత్తిల్లే స్వర్గం' అని తల్లిదండ్రులకు తెగేసి చెప్పి భర్త ఇంటికి వచ్చెసింది. నాటి నుండి ఎటువంటి కలహాలు లేక వారెంతో అన్యోన్యంగా జీవించారు.
శ్రీ సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం !
మహరాష్ట్రలో తుర్భేగాం అనే ఊరిలో నివసించే శాంతాబాయి అనే ఆమెను కాలి వేలు మీద ఎముక కుళ్ళిపోయి చీము కారుతుండేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. ఖరీదైన మందులను వాడినప్పుడు కాస్త నెమ్మదించినా, ఆ తర్వాత మళ్ళీ మామూలే! ఆమె ఆర్ధిక స్థితి అంతగా సహకరించకపోవడం వలన ఎక్కువ కాలం వైద్యం చేయించుకోలేకపోయింది. నొప్పి ముదరడం వలన రోజులో అధిక భాగం మంచానికే పరిమితమైపోయింది. స్నేహితుల సలహాపై బాబాను తన అనారోగ్యాని తగ్గించమని ప్రార్ధించింది. కరుణా సముద్రుడైన సాయి ఒకరోజు రాత్రి కలలో కనిపించి 'దేకామాలి' అనే చెట్టు యొక్క ఆకులను పసరుగా చేసుకొని గాయంపై రాసుకోమన్నారు. ఆయన ఆజ్ఞను తు.చ పాటించి ఆ పసరును పూసుకోగానే కొద్ది రోజులలోనే ఆ గాయం మానిపోయింది. దేకామాలి అనే ఆకు అసలు వైద్యానికే పనికి రాదని ఆ తర్వాత ప్రకృతి వైద్యులు చెప్పారు. ఈ చికిత్సలో అసలు రహస్యం శ్రీ సాయి వాక్కే!
ఇంకొక సంధర్భం లో హరి భావూ ఫన్సే రామేశ్వరం వెళ్ళి అక్కడి నుండి శిరిడీ వచ్చాడు. యాత్ర మరికొన్ని రోజులు పొడిగిస్తునట్లు తన తల్లికి మాట మాత్రమైనా చెప్పలేదు. సాయిని దర్శించి ఎంతో ఆనందం పొందాడు ఫన్సే. అప్పుడు సాయి అతని నుండి దక్షిణ తీసుకొని 'తక్షణమే ఇంటికి వెళ్ళు, నీ కోసం రామేశ్వరం పస్తులుంది. నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది' అని అన్నారు. ఆ మాటలు అర్ధం కాకపోయినా సాయి ఆజ్ఞను శిరసా వహించి ఫన్సే ఇంటికి వెళ్ళాడు. అక్కడ అనుకున్న సమయానికి తిరిగి రాని కారణంగా కొడుకుకు ఏమైనా ప్రమాదం సంభవించిందేమోనని ఆందోళనతో అతని తల్లి నిద్రాహారాలు మాని 'బాబా! తక్షణమే నా కొడుకును క్షేమంగా ఇంటికి పంపించు! అని ప్రార్ధిస్తోంది. ఎక్కడ బొంబాయి? ఎక్కడ శిరిడీ? బాబా యొక్క సర్వజ్ఞతకు ముదమొందిన ఫన్సే ఆయనకు జీవితాంతం అంకిత భక్తునిగా మిగిలిపోయాడు.
సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|