|
|
Articles: My Thoughts | గిడుగు బాట పట్టామా? - Site Administrator
| |
(డా.సామల రమేష్ బాబు)
ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమానికి 1863లో పుట్టి 1940లో గిట్టిన గిడుగు రామమూర్తి స్ఫూర్తిప్రదాత. 1906 నుండి 1940 దాగా ఆయన తనను తాను పూర్తిగా అంకితం చేసుకొని నడిపిన భాషోద్యమానికి వ్యావహారిక భాషోద్యమంగా పేరు వచ్చింది. పండితుల మౌఢ్యాన్ని వదిలించి, ప్రజలకర్థమయ్యే విధంగా తెలుగు రచనలను సరియైన దారిలోకి తెచ్చినవాడు గిడుగు. వ్యాకరణమనే పేరుతో, సంస్కృతాధిక్యతతో బిగిసుకుపోయిన తెలుగును వ్యావహారికంగా ఉపయోగించే విధంగా అందరి ఆలోచనల్లో మార్పును సాధించిన ఉద్యమం కనుక అప్పటి ఉద్యమాన్ని 'వ్యావహారిక భాషోద్యమం' అన్నారు. సామాన్య ప్రజల్లోంచివచ్చే భాషను దోపిడీ చేసి, తమ ఇష్టమొచ్చిన రీతిలో విద్యనూ, సాహిత్యాన్నీ వారి కందకుండా చేసిన స్వార్థపు ఆలోచనల మీద ఆయన చేసిన తిరుగుబాటు అది. గిడుగుతో పాటూ ఆయన తర్వాత కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, తాపీ ధర్మారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి లాంటివారు ఈ తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూనే వచ్చారు.
మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో తెలుగు ప్రజల పాత్ర తక్కువేమీ కాదు. ముందువరసలో ఉన్నవారిలో మనమూ ఉన్నాం. ప్రజాస్వామ్య భావనలు, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పోరాటాలు తెలుగునేలపై బలంగా వెల్లివిరిశాయి. ఈ అన్నింటిలో ప్రజల భాషయే సహజ మాధ్యమంగా ఉంటుంది. పండితుల మనుకునేవారి కావ్యాభాష ప్రజాస్వామ్య వ్యవహారాల్లో ఇమడదు, జనజీవితంలో దానికి చోటే ఉండదు. ప్రజల సామూహిక వికాసాన్ని పెంపొందింపజేయడానికి వారి భాషను పటిష్టం చేయవలసి ఉంటుంది. గిడుగు ఈ వాస్తవాన్ని గ్రహించనవాడు. 'దేశానికి స్వాతంత్ర్యం ఎటువంటిదో, ప్రజలకు భాషా స్వాతంత్ర్యం కూడా అటువంటిదే'. స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం ఎటువంటి ఎటువంటిదో భాషా స్వాతంత్ర్యాన్ని దురుపయోగం, నిరుపయోగంగా వర్తింపజేయడం కూడా అటువంటిదే! అందుకనే 'ప్రజలందరూ చదుకోవాలనీ, అపుడు కానీ ప్రజల వల్ల, ప్రజలచేత, ప్రజలకోసం పరిపాలన వ్యవస్థ అనే ప్రజాస్వామ్యం ఉత్తమ ఫలసిద్ధిని చేకూర్చలేదనీ' ఆయన పదేపదే చెప్పారు. అందువల్ల ఆయన నిర్వహించిన వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రజాస్వామిక భాషోద్యమం అనుకోవాలి.
దీన్ని నేటి పరిస్థితులకు మనం అన్వయం చేసుకోవాలి. అప్పుడే గిడుగు రామమూర్తి స్మృతిని జయంతిగానో, వర్థంతిగానో జరుపుకోవడంతో సరిపెట్టుకోవడం కాకుండా, ఈనాడూ దాన్నెలా అర్థం చేసుకొని, నేటి అవసరాలకు అనుగుణంగా ఉద్యమాన్ని తీర్చిదిద్దుకోవాలో ఆలోచించి సరియైన తాత్విక భూమికను ఏర్పాటు చేసుకోగలుగుతాం. గిడుగు జయంతిని ఒక దశాబ్ద కాలానికి పైగా నిరంతరం జరుపుతున్న తెలుగు భాషాచైతన్య సమితినీ, 2003 నుంచీ దీనికి విస్తృత ప్రచారాన్నిచ్చి రాష్ట్రంలోనూ, బయటా నిర్వహిస్తున్న తెలుగు భాషోద్యమ సమాఖ్యనూ, తెలుగు రచయితల్నీ, సంస్థల్నీ జరపడం ఇక్కడ అభినందించాలి. ఈ రోజును 'తెలుగు భాషాదినోత్సవం'గా జరపడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు తెలుగు భాషోద్యమం నడుస్తున్న నిజం అందరికీ తెలిసిందే. అయితే తెలుగువారికి నేడు ఎదురవుతున్న సవాళ్లను పటిష్టంగా ఎదుర్కోవడానికి కాలసిన తాత్విక భూమికను తిరిగి నిర్వహించుకోవలసిన అవసరం ఉందనేది వాస్తవం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|