|
|
Articles: My Thoughts | సాహసిక సమాజం - Site Administrator
| |
(డా.పి.శివరామకృష్ణ)
నవ యవ్వనం - చుట్టూ గుబులెత్తించే కొండపడుచులు, రంపచోడవరం అడవుల నుండి బయటపడాలనే ఆరాటం - ఇంతలో ఎం.ఎ. పరీక్షలొచ్చాయి. (1975). నవల మీద తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి - చలం, గోపీచంద్, బుచ్చిబాబు, విశ్వనాథ వగైరాల రచనలు చదవసాగాను. వయో సహజమైన భావోద్వేగాలతో నలిగిపోయే ఆ పాత్రలు, నాలో చాలా అలజడి రేపేవి. ఆ నవలల్లో తత్త్వాన్వేషణ పరిశోధనా విషయంగా 'ఆధునికాంధ్ర కవిత్వం' స్థాయిలో కృషి చేయాలని ఉవ్విళ్ళూరేవాడిని.
నాతో పాటు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, బ్యాంకు ఉద్యోగం సంపాదించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిన రంధి శ్రీనివాసరావును ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనకు గల అవకాశాలను కనుక్కోవలసిందిగా కోరాను. అతడు తెలుగు శాఖాధ్యక్షులకు నా విన్నపాన్ని తెలియజేశాడు. వారం తిరగకుండానే ఆచార్య రామరాజు నుండి 'నీవు వస్తే చర్చించవచ్చు'నని ఉత్తరం. కలవగానే గిరిజనుల పాటలు, కథలు, ఏవైనా సేకరించి - విశ్లేషించాలని సూచన రూపంలో వారి ఆదేశం. మళ్ళీ వనవాసం ఇష్టంలేదు కాని వారి ఆజ్ఞను శిరసావహించి అడవుల వెంటపడ్డాను. అప్పటిదాకా, ఎక్కడ ఇరుక్కుపోతానో అని దూరదూరంగా ఉంచిన జనాల మధ్యలో మునిగిపోయాను. ఓరియంటల్ కళాశాలలో భాషాప్రవీణ - ప్రైవేట్ గా ఎం.ఎ పూర్తిచేసిన నాకు అప్పటిదాకా గిరిజనులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక శాఖ (అంత్రపాలజీ) ఉన్నదని తెలియదు.
స్త్రీ పురుష సంబంధాలలో వివిధ కోణాలు, సమాజం - సంస్కృతి మీద తర్కవితర్కాలు, జీవవైవిధ్యం - జీవన వైవిధ్యం, వనరుల మీద పెత్తనం - పంపకం, సగటు యువకునికి వలెనే ఈ ప్రశ్నల పద్మవ్యూహంలో దిక్కుతోచని నాకు, నల్లమల అడవులు, గోదావరి లోయలు, విశాఖ బయళ్ళలో గిరిజన గ్రామాలు వ్రేపల్లెలుగా, ఆ ప్రాంతాలు బృందావనాలుగా కనిపించసాగాయి. విషయ సేకరణ కోసం నేను ఆటపాటలతో అందెవేసిన పడుచుల వెంటపడుతుంటే, కొందరు నా వెంటపడేవారు. ప్రతి సంవత్సరం జనవరి నుండి జూన్ దాకా ఈ అడవులలో, జూలై - డిసెంబరు మధ్య కాలం ఈ అనుభవాలను అన్వయించుకుంటూ గ్రంథాలయాల్లో, గిరిజనులను, అడవులను చిత్రించే సినిమాలు 'గాడ్స్ మస్ట్ బి క్రేజీ, ఆఫ్రికన్ సఫారీ, డ్రమ్స్ ఎమెరాల్డ్ ఫారెస్ట్' వగైరా సినిమాలు చూస్తూ, మధ్యలో నాటి విప్లవ రాజకీయాల చర్చలు గమనిస్తూ గడిచిపోయేది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|