పులకించిన రత్నగిరి
రాజమండ్రి : రత్నగిరి క్షేత్ర పాలకులైన సీతారాముల సమక్షంలో భువన మోహనరూపుడైన సత్యదేవుని కల్యాణం రత్నగిరిపై అంగరంగవైభంగా జరిగింది. వైశాఖ శుద్ధ ఏకాదశి శుభఘడియల్లో ముగ్ధమనోహరంగా ముస్తాబైన సత్యదేవుడు లక్షలాది మంది భక్తులకు కన్నుల పండుగ చేస్తూ అమ్మలగన్న అమ్మ అనంతలక్ష్మిని పరిణయమాడాడు. ఈవేడకను తిలకించిన భక్తజనం పునీతులయ్యారు. మధపర్కాలను, మంచి ముత్యాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ కమిషనర్ సుందర్ కుమార్ సత్యదేవుని కల్యాణ సందర్భంగా సమర్పించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ పి.సుందర్ కుమార్ దంపతులు, చైర్మన్ ఐ.వి.రామ్ కుమార్, ఈఓ ఎస్.కొండలరావు దంపతులు కల్యాణ వేదిక వద్దకు వధూవరులను తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారికి గౌరీపూజ, స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 10.40 గంటలకు సుముహూర్తంలో అమ్మవారి శిరస్సుపై స్వామివారు, స్వామివారి శిరస్సుపై అమ్మవారు జీలకర్ర బెల్లం ఉంచారు. భక్తజన గోవింద నామ స్మరణల మధ్య త్రిమూర్తి స్వరూపుడైన సద్యదేవుడు అమ్మవారి మెడలోమంగళసూత్రధారణ చేశారు. భక్తులకు నేత్రానందంగా స్వామివారు, అమ్మవార్లు ఒకరిపై మరొకరు మంచి ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ వేడుక కలిగించారు. పట్టుపీతాంబరాలు, విశేష ఆభరణాలతో నుదుట కల్యాణతిలకం, బుగ్గన చుక్కతో స్వామి, అమ్మవార్లు దివ్య తేజస్సుతో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మగంధి, రక్షాబంధనం, వేదపండితుల మహాద్వాశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి భధ్రాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ, సింహాచలం, శ్రీశైలం దేవస్థాల తరఫున పట్టువస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేణు, తుని మున్సిపల్ చైర్ పర్సన్ కె.శోభారాణి, జిల్లా జడ్జి నాగమారుతీ శర్మ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 6 May, 2009
|