ఎంసెట్ కు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్ : ఈనెల 14న నిర్వహించే ప్రవేశ పరీక్ష 'ఎంసెట్'కు అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన నగరంలోని గిరిరాజ్ కళాశాల ఆవరణలో విలేఖరులతో ముచ్చటించారు. ఇంజనీరింగ్ కోసం 19, మెడిసిన్ కోసం 5 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2-30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మెడిసిన్ విభాగాల్లో ఎంసెట్ ను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ 7790 మంది, మెడిసిన్ లో 2196 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన వివరించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఇంజనీరింగ్ కోసం ఉదయం 9.10 గంటలకు, మెడిసిన్ కోసం మధ్యాహ్నం 1.50 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తామని, నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా వారిని పరీక్షలకు అనుమతించే ప్రసక్తే లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతీ సెంటర్ కూ ఆయా కళాశాల ప్రిన్సిపాల్ చీఫ్ సూపరిడెంటెండెంట్ గా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ క్యాలుక్యులేటర్, డయాగ్రామ్, ఫేజర్ నిషేధమన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్ గంగాధర్ పాల్గొన్నారు.
News Posted: 13 May, 2009
|