నిజామాబాద్ : రక్షిత తాగునీటి నిర్లక్ష్యం వల్ల వ్యాధులు విజృంభించాయి. అతిసారంతో జిల్లా వణికిపోతోంది. తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిధుల సమస్య లేకపోయినా మంచినీటి పథకాల మరమ్మత్తు పనులు పూర్తి కాకపోవడంతో చిలుం పట్టిన బోర్లే ప్రజల దాహం తీర్చేందుకు దిక్కయ్యాయి. ఫలితంగా బాల్కొండ మండలం కిసాన్ నగర్ మసీదు ప్రాంతంలో కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా కలుషిత నీరు త్రాగడం వల్ల డయేరియా సోకినట్లు వైద్యులు తెలిపారు. బాల్కొండ ఇన్ ఛార్జి ఎంపీడీవో గోపి బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారితో మాట్లాడిన తర్వాత నీరు కలుషితం అవుతున్న ప్రదేశానికి వెళ్ళి ఆయన పరిశీలించారు. బోరు పక్కన ఉన్న నల్లా పైపు తుప్పుపట్టి ఉండడం గమనించి ఆ పైపును తొలగించి కొత్త పైపు వేయాలని గ్రామ పంచాయితీవారిని ఆదేశించారు.