శంకరగుప్తంలో `మంగళంపల్లి'
రాజమండ్రి : ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన పుట్టిన రోజును స్వస్థలమైన శంకరగుప్తంలో జరుపుకొన్నారు. బాలమురళీ కృష్ణ 1930 జులై ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం శంకరగుప్తంలో జన్మించారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం బాలమురళీకృష్ణ జన్మదినోత్సవం తొలి ఏకాదశి రోజు కావడంతో గురువారం ఈ వేడుకలను బంధువులు నిర్వహించారు.
బాలమురళి కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. బాలమురళీకృష్ణ తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. వయోలిన్ టీచర్ గా ఆయన శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు. వృత్తిరీత్యా ఆయన అక్కడే స్థిరపడ్డారు. బాలమురళీకృష్ణ పుట్టిన 13వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్ముమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో బాలమురళి పెరిగారు. `కన్నతల్లి దూరమైన బాలమురళిని సంగీత సరస్వతి' అక్కున చేర్చుకుంది. తన ఒడిలో లాలించి ఆయనను తన స్వరూపంగా ప్రపంచానికి అందించింది.
తాతగారు ప్రయాగ రంగదాసు సంగీత విద్వాంసులు కావడంతో బాలమురళీని ఆయన సంగీత పాఠశాలలో చేర్చించారు. తరువాత విజయవాడలోని పారుపల్లి రామకృష్ణాచార్యులు వద్ద శిష్యులుగా చేర్చారు. పదో ఏటనే సంగీత కచేరీలో బాలమురళి ఘనత సాధించారు. 12వ సంవత్సరంలో 800 సంకీర్తనలకు బాణీలు కట్టి ఆయన పాటలుపాడారు. `భక్తప్రహ్లాద' సినిమాలో నారదుడిగా, `సందెని సింధూరం' అనే మళయాళం సినిమాలో నటించారు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను ఆయన పొందారు. ప్రపంచ స్థాయిలో `బెనిలియర్' అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.
News Posted: 2 July, 2009
|