టిడిపిలోకి పుట్టా మధు
కరీంనగర్ : రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, అవినీతి కార్యక్రమాలపై రాజీ లేని పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసిరావడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావచ్చని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన పిఆర్పీ అభ్యర్థి పుట్టా మధు ఆధ్వర్యంలో పలువురు పిఆర్పీ నాయకులు, కార్యకర్తలు సోమవారం టిడిపిలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. టిడిపి హయాంలో కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ కెనాల్ ను ఆధునికీకరించామని, మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, రోడ్లు నిర్మించి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు.
కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను గత ఐదేళ్ళుగా నిలువరించలేదని చంద్రబాబు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. గత 50 ఏళ్ళలో ఏనాడూ లేని కరవు పరిస్థితి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ సర్కార్ కు చీమకుట్టినట్లైనా లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దానికి కాంగ్రెస్ నాయకులు అక్రమంగా నిల్వలు చేయడమే అని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హరీశ్వర్ రెడ్డి, దేవేందర్ గౌడ్, రమణ, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 25 August, 2009
|