ఊబిలో చిక్కుకున్న కూలీ
రాజమండ్రి : వాడుకలేని మంచినీటి బావిని పూడ్చే కార్యక్రమంలో ఆడ్డగళ్ల లక్ష్మణరావు అనే కూలి ఊబిలో చిక్కుకున్నాడు. బావిని పూడ్చే నిమిత్తం వరలు తీస్తుండగా మోరికి చెందిన లక్ష్మణరావు ఊబిలో నడుము లోతుకు పైగా కూరుకుపోయాడు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం కళాశాల వెనుక ఉన్న బావిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో లక్ష్మణరావు బావిలో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతన్ని పైకి లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాజోలు అగ్నిమాపక సిబ్బంది, మలికిపురం పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పరిశీలించారు. ఎంపీపీ ముత్యాల కాశీ, మండల ఉపాధ్యక్షుడు గెడ్డం తులసీ భాస్కరరావుల చొరవతో పొక్లెయిన్ తీసుకువచ్చారు. దీని సహాయంతో బావికి సమాంతరంగా మరో గోతిని తవ్వుతున్నప్పుడు పక్కనే ఉన్న డ్రైన్ కూలిపోవడంతో బావిలోకి నీరు ముంచెత్తింది. ఫైర్ సిబ్బంది ఇంజను తెచ్చి నీటిని తోడేందుకు ప్రయత్నించగా ఇంజను పనిచేయలేదు. దాంతో స్థానికులు బకెట్లతో బావిలోని నీటిని బయటకు తోడిపోశారు. ఒక దశలో సహాయక చర్యల్లో పాల్గొన్న వ్యక్తి అలసిపోయి సొమ్మసిల్లిపోగా 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణరావు రక్షించండి అంటూ చేసిన ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. ఎట్టకేలకు రాత్రి 11 గంటలకు వీరి కష్టం ఫలించి అతడిని ప్రాణాలతో పైకి తీసుకు రాగలిగారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News Posted: 10 September, 2009
|