బాధితులకు రవి ట్రస్ట్ సేవలు
హైదరాబాద్ : దివంగత టిడిపి ఎమ్మెల్యే, తన భర్త పరిటాల రవి ఆశయ సాధన కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఇటీవలి వరదలకు దెబ్బతిన్న కర్నూలు మండలంలోని నిడ్డూరు, బాంపురం గ్రామాలను పరిటాల రవి, శ్రీహరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున దత్తత తీసుకున్నామన్నారు. వారం రోజుల నుంచి ఈ గ్రామాల్లో వరద సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సునీత ఆదివారంనాడు నిడ్డూరు, బాంపురం గ్రామాల్లో పర్యటించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వరద బాధితులతో సునీత మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించి అవసరాలు తీరుస్తామన్నారు. వరద బీభత్సం వల్ల నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లోని చెత్తను తొలగించేందుకు 5 జేసిబిలు, 20 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామన్నారు. పరిటాల రవి పేరు మీద కమ్యూనిటీహాలు నిర్మిస్తామన్నారు. గ్రామాల్లోని రోడ్లను, మౌలిక సదుపాయాలను బాగు చేస్తున్నామన్నారు. ఈ రెండు గ్రామాల్లో విద్యార్థుల కోసం పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. మంచినీటి ట్యాంకులు ఏర్పాటుచేసి మంచినీరు అందిస్తున్నామన్నారు. ఇళ్ళకు విద్యుత్ ను పునరుద్ధరించామన్నారు.
తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 25 నుంచి 30 కేజీల బియ్యం, ఒక బిందె, ఒక బకెట్, చాప, దుప్పటి, స్త్రీ, పురుషులకు అవసరమైన దుస్తులు, సామగ్రి అందిస్తున్నామన్నారు.
News Posted: 19 October, 2009
|