16న మహా కుంభాభిషేకం
కాకినాడ : కార్తీక మాసం చివరి సోమవారం, అమావాస్య సందర్భంగా కాకినాడ సాగరతీరాన వేంచేసియున్న మంగళాంభికా సమేత ఆది కుంభేశ్వరస్వామికి 34వ మహా కుంభాభిషేక మహోత్సవాన్ని 16వ తేదీన నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రతిష్ఠించిన కోటీ ఎనిమిది లక్షల శివలింగాలకు 501 మంది సుమంగళిలచే అభిషేకాలు చేయిస్తారు. కాకినాడకు చెందిన శివభక్తుడు ఈ కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజ ప్రారంభించి రసలింగేశ్వరునికి విభూతితో అభిషేకం చేస్తారు. అనంతరం ఈ విభూతిని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. పరమేశ్వరునికి బిళ్వార్చన, అభిషేక ద్రవ్యాల కలశాలతో అభిషేకాలు, ద్వాదశలింగాలకు అర్చన, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామికి మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
నగర పరిసర ప్రాంతాల నుంచి భక్తులు కుంభాభిషేకాన్ని దర్శించుకునేందుకు ఎన్ సీఎస్ గ్రూపు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. భానుడి గుడి సెంటర్, ఎస్ ఆర్ కే బిల్డింగ్స్ సినిమారోడ్, దుర్గగుడి సెంటర్, జగన్నాథపురం వంతెననుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. నారాయణం నాగేశ్వరరావు, నారాయణం మురళీ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమం, పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్ దంపతుల ఆధ్వర్యంలో అభిషేకాలు, కల్యాణ మహోత్సవాలు, కృష్ణా ఎంపోరియం అధినేత రాజశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామికి మహాకుంభాభిషేకం, ఈర్ల సూర్యారావు ఆధ్వర్యంలో బిల్వార్చన నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ ప్రతినిధులు బదిరెడ్డి కృష్ణ, ఆర్.శ్రీనివాసరావులు తెలిపారు.
News Posted: 9 November, 2009
|