ఘనంగా కుంభాభిషేకం
కాకినాడ : ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా కార్తీక అమావాస్య పర్వదినాన కాకినాడ సముద్రతీరాన నిర్వహించే అధికుంభేశ్వరుని మహాకుంభాబిషేకం వేలాది మంది భక్తుల రాకతో సోమవారం సాగరతీరం మారుమ్రోగింది. ఈ 34వ కుంభాభిషేకం కార్యక్రమం శ్రీ మంగళాంభికా సమేత శ్రీ అధి కుంభేశ్వరస్వామి వద్ద 8 లక్షల శివలింగాలకు అభిషేకం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా కన్యలతో ఆధికుంభేశ్వర పాదరస లింగానికి సహస్ర కలశాభిషేకం,రసలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. శివభక్తుడు వీరభద్రస్వామి ఆదేశాల మేరకు కళాబంధు డా.టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాడు మహా కుంభాభిషేకం జరుగుతుంది.
ఉదయం 7గంటల నుండి గోపూజతో మొదలై విఘ్నేశ్వరపూజ, పంచకారవిభూదితో అభిషేకం, కోటీ 8 లక్షల శివలింగాలకు మహాకుంభాభీషేకం నిర్వహించారు. లలితా దేవికి సహస్రనామాలతో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అభిషేకం విభూదిని సముద్రంలో నిమజ్జనం చేశారు. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామీ మహా కుంభాభీషేకం, ఏకాంతసేవ పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడకు చెందిన నారాయణం నాగేశ్వరావు, నారాయణం మురళీ,చలమలశెట్టి సునీల్, ఈర్ల సూర్యారావుల అధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కుంభాభీషేకానికి హాజరైన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సాయంత్రం ఆధ్యాత్మిక సభలో యోగి రాంజీ తదితరులచే ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచానాలు భక్తులను విశేషంగా అకట్టుకున్నాయి. ఈ కుంభాభిషేకానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహకులు, అవాంచానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
News Posted: 17 November, 2009
|