వైభవంగా ఆరట్టు ఉత్సవం
నిజామాబాద్ : నిజామాబాద్ లో అయ్యప్ప స్వాములు ఆరట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఇందూరు అయ్యప్ప ఆలయం ట్రస్ట్ నేతి రామకృష్ణమ్మ, గుండయ్య గురుస్వామిల ఆధ్వర్యంలో వైభవంగా ఊరేగింపు జరిపారు. స్వామియే శరణం అయ్యప్ప... అయ్యప్ప స్వామి శరణం అంటూ అయ్యప్ప స్వాములు భక్తి పారవశ్యంతో చేసిన నృత్యాలు కనువిందు చేశాయి. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిపించారు. అయ్యప్ప ఆలయం వద్ద ప్రారంభమైన ఊరేగింపు రైల్వేకమాన్, ఎన్టీఆర్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, పోచమ్మ మందిరం, గోల్ బనుమాన్, ఆర్యసమాజ్, పెద్దబజార్, గాజుల్ పేట, ఖిల్లా ప్రాంతాల మీదుగా బొడ్డెమ్మ చెరుకువుకు చేరుకుంది. తదనంతరం అక్కడ అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహానికి నవవిధాభిషేకం చేయించి, భక్తులు చెరువులో స్నానమాచరించారు. ఫిల్టర్ బెడ్ వద్ద భిక్ష ఏర్పాటు చేసారు. పెద్ద బజార్ ప్రాంతంలో ఓ భక్తుడు అయ్యప్ప రథానికి స్వాగతం పలుకుతూ రోడ్డుపై సుమారు 100 ఫీట్ల పొడవునా పుష్పాలతో అలంకరించడం విశేషం. అయ్యప్పస్వామికి అడుగడుగునా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి, కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
News Posted: 11 December, 2009
|