చిరు కోసం రైలుపై రాళ్ళు
డోన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కోస్తా, రాయలసీమల్లో పర్యటనలు చేస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తమ వద్ద ఆగాలంటూ ఆయన ప్రయాణిస్తున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ పై అభిమానులు రాళ్ళు విసిరారు. జిల్లాలోని డోన్ రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సోమవారంనాడు అనంతపురంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులకు సంఘీభావం తెలిపిన చిరంజీవి ప్రశాంతి ఎక్స్ ప్రెస్ బయలుదేరి రాజమండ్రి వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డోన్ రైల్వే స్టేషన్ లో భారీ సంఖ్యలో గుమిగూడి చిరంజీవి బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. వారి కోరిక మేరకు చిరంజీవి పలుమార్లు రైలు గుమ్మంవద్దకు వచ్చి అభివాదం చేశారు. అయినా అభిమానులు చిరంజీవిని ప్లాట్ ఫారంపైకి దిగిరావాలంటూ కోరారు.
అయితే, అప్పటికే సమయం మించిపోతుండడంతో వారి విజ్ఞప్తిని చిరంజీవి సున్నితంగా తోసిపుచ్చారు. దీనితో ఆగ్రహం చెందిన అభిమానులు రైలుపై రాళ్ళతో దాడికి దిగారు. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలిపోయాయి. మరికొందరైతే చిరంజీవి ప్రయాణిస్తున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ను ముందుకు కదలనీయబోమంటూ రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్నారు. దీనితో రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
News Posted: 22 December, 2009
|