సిఎంపై ఆశ లేదు: బొత్స
విజయనగరం : రాష్ట్రం విడిపోతే ప్రత్యేక ఆంధ్రకు ముఖ్యమంత్రిని కావాలన్న ఆశ తనకు లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విడిపోతేనే మేలంటూ తాను శుక్రవారం చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే తమకు ఒనగూరే లాభమేమిటో సమైక్యాంధ్ర వాదులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం విభజనకు తాను సానుకూలం అంటూ బొత్స సత్యనారాయణ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజారాజ్యం పార్టీ నాయకులు తప్పుపడుతున్న నేపథ్యంలో ఆయన శనివారం నాడు తన స్వగృహంలో మీడియా సమావేశంలో స్పందించారు. ఉత్తరాంధ్రతో పాటు అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలు వెనుకబడడానికి కారణాలేమిటో సమైక్య వాదులు జవాబు చెప్పాలన్నారు.
రాష్ట్రాన్ని విభజించడం వల్ల తమకేమీ నష్టం లేదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వబోతున్నట్లు మంత్రి బొత్స పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకూ కండ బలం ఉన్న వారి ప్రాంతాలనే అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రం విడిపోవడం వల్ల రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు వెనుకబడిన ప్రాంతాల పైన కూడా దృష్టి సారించి అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. నిజానికి ఈ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులు మొదలయ్యాయని బొత్స పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఉపాధి, విద్యావకాశాలపై పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సమైక్య వాదులు ఎందుకు విభేదిస్తున్నారో స్పష్టం చేయాలని బొత్స డిమాండ్ చేశారు.
News Posted: 27 February, 2010
|