|
|
Articles: My Thoughts | SPURTHI. - Mrs. mayavathi gurram
| |
ఈ ప్రపంచంలో మనమూ పుట్టాం. కానీ అందరూ జీవితంలో విజయం సాధించలేకపోతున్నారు. కొందరికే విజయాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్లు ఏమైనా గొప్పగా పుడుతున్నారా?
ఏ మహాత్ముడి జీవిత చరిత్ర తీసుకున్నా, ఎవరూ స్వతహాగా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినవారు కాదు. చిన్నప్పటినుండి ఆకలి బాధలు తట్టుకొని బాగా చదువుకోవాలి అనే తపనతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నింటినీ ఓర్పుతో సహిస్తూ, వదలని పట్టుదలతో వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని, చివరికి విజయం సాధించారు.ఈ విజయంతో గర్వాన్ని తెచ్చుకోకుండా, వారి పనులను మరచిపోకుండా సమాజానికి ఏదో ఒకటి చేశారు. అందుకే వారు చరిత్రలో నిలిచిపోయారు. మనకి స్ఫూర్తి ప్రధాతలయ్యారు.
మనం ఎలా ఉండాలో ఏకాంతం చెబుతుంది. మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. ఏకాంతంలో మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. మన అంతరంగం తెలుస్తుంది. ఒక శిల్పి ఎలా అయితే శిల్పానికి రూపం ఇస్తాడో, మన ఏకాంతం కూడా మన వ్యక్తిత్వానికి రూపమిస్తుంది. మంచి శిల్పానికి ఎంతటి ఆదరణ వస్తుందో, మన వ్యక్తిత్వానికి కూడా అలాంటి ఆదరణ సమాజం చూపెడుతుంది. మనలో చాలా మంది చిన్న పిల్లల స్వభావాన్ని కలిగి ఉంటాం. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే, మనం నలుగురిలో వెళ్ళడానికి భయపడం. ప్రతి మనిషికి అంతర్గతంగా తెలియని చాలా విషయాలు ఉంటాయి. ఏదో ఒక రంగంలో విజయం సాధించినంత మాత్రాన వారికి అన్నీ తెలుసు అనే భావనకు రాకూడదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని వెదికి బయటకు తీసినప్పుడే ఆ వ్యక్తి యొక్క విజయానికి పునాది అవుతుంది.
ఎవరో, ఏ మహానుభావుడో మనల్ని వచ్చి రక్షిస్తాడు అనే నమ్మకంతో వుండకూడదు. మన జీవితపు బరువు మనకే తెలుస్తుంది. కాబట్టి ప్రతి కష్టాన్ని సవాలుగా తీసుకొని ముందుకు సాగాలి. కష్టంలో వున్నప్పుడే మనకు నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తారు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మన చుట్టూ వున్న వారంతా ఒక్క సారిగా మాయమవుతారు. అప్పుడే మనకునిజమైన బంధువులు, స్నేహితులు ఎవరో తెలుస్తారు. జీవితమనేది వెలుగు, నీడల కలయిక వంటింది. ఎండలో నుండి వస్తే కదా నీడల సుఖం తెలిసేది. అందుకే కష్టాలకు భయపడకూడదు. ఈ కష్టాలే మనలోని అసలైన వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తాయి. కాబట్టి కష్టాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి.
ఈ భూమ్మీద పుట్టినందుకు కీర్తి అని చెప్పుకునే మన గుర్తు ఒకటి వదిలి వెళ్ళాలి. అందరం పుడుతున్నాం, చస్తున్నాం, కాని కొందరే ఎందుకు చరిత్రలో శాశ్వతంగా నిలిచి వుంటున్నారు. మనం ఎందుకు వుండలేకపోతున్నాం! అలాంటి పనులు ఎందుకు చేయలేక పోతున్నాం! మనంకటూ గుర్తింపూ, వునికి ఏర్పరచుకోవాలి. అది ఏదో ఒక రంగం కావచ్చు, కానీ శాశ్వతంగా మనం కూడా చరిత్రలో నిలిచి పోయే పనలు చెయ్యాలి. మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే దీనికి కారణం అయిన వారిని మరవకూడదు. ఎక్కడికి వెళ్లినా మన మూలాలను మరవకూడదు. కాబట్టి ఏదో ఒక రూపంలో మనకు ఉన్నదాంట్లో సమాజానికి పనికి వచ్చే పనులను చెయ్యాలి. సమాజం అంటే ఎవరో కాదు, మనం, మనచుట్టూ వున్న వాళ్లమే కదా, అందుకని వారి హృదయాల్లో శాశ్వతంగా వుండిపోయే విధంగా నడుచుకోవాలి. అప్పుడే మనం ఇంకొకరికి స్ఫూర్తిని కలిగించినవాళ్ళం అవుతాం.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|