|
|
Articles: Devotion | సాయి సత్య స్వరూపం - Mr. Pratap Cherukuri Pratap
| |
సాయి ఎవరు ? అనే మౌలికమైన ప్రశ్నకు వివిధ సాయి భక్తుల నుండి విభిన్నమైన సమాధానాలు వస్తాయి. సాయి అంటే శిరిడీలో 60 సంవత్సరాల పటు నివసించి, యోగ విద్యలో పరిపూర్ణుడై ఎన్నో లీలలు చేసిన గురువు అని కొందరు, శిరిడీ మందిరంలో ప్రతిష్టించిన విగ్రహం రూపంలో ఉన్న దేవుడని కొందరు, జీవితమంతా భిక్షాటనతో జీవించిన ఒక ముస్లిం ఫకీరు అని మరికొందరు భావిస్తుంటారు. యద్భావం – తద్భవతి ! భావం బట్టే మనకు లభించే గురువు అనుగ్రహం ఆధారపడి ఉంటుంది. సాయి పట్ల మన భావం అల్పమైతే మనపై వర్షించే సాయి అనుగ్రహం కూడా అల్పం గానే ఉంటుంది. సాయి అనుగ్రహం మనపై పుష్కలంగా వర్షించాలంటే సాయిపై మన భావం కూడా ఉన్నతంగానే ఉండాలి. అందుకు సాయి ఎవరు? ఆయన బోధలు, తత్వం ఏమిటి అన్న విషయాలను అవగతం చేసుకుంటే తప్ప ఉన్నతమైన, శ్రేష్ఠమైన భావాలు మనకు కలగవు.
అందుకే తన గురించి శ్రీ సాయి ఏమన్నారో ఒకసారి శ్రవణం చేద్దాం : 'అన్ని ప్రాణుల హృదయాలలో ఉండే నేనే నిజమైన నేను' అని ఒక సంధర్భంలో, 'నేనే బ్రహ్మమును, నేను నిత్య శుద్ధ బద్ధ ముక్తుడను, నేనే ఓంకారాన్ని, అందరి హృదయాలలో అందరి కంటే సమీపంగా నివసిస్తుంటాను. నన్ను శ్రద్ధాభక్తులతో పూజిస్తే శ్రేయస్సు పొందుతారు' అని చెప్పారు. ఇంకొక సందర్భంలో 'నేను మీకు అన్నింటి కంటే ఎంతో సమీపస్థుడను, సర్వ అంతర్యామిని, అందరికీ ప్రభువును నేను. ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపమే! పిపీలికాది పర్యంతం జడమైన పర్వతాల వరకు అన్నీ నా వ్యక్త స్వరూపాలే. ఈ విశ్వమంతా నా ఆత్మ స్వరూపమే. నా రాకపోకలకు తలుపులతో నిమిత్తం లేదు. నేను ఏ ఆధారం లేక ఈ జగత్తు అంతటా ప్రయాణం చేయగలను. నేను నామ, రూప, గుణ రహితుడను. సర్వత్రా నిండి ఉన్న నేను మూర్తీభవించిన జ్ఞానం, చైతన్యం, ఆనందరూపమని అవగతం చేసుకోండి. నా నిజ స్వరూపాన్ని తెలుసుకొని సదా నన్నే ధ్యానించు' అని అపూర్వం గా పలికాడు శిరిడీ సాయినాధుఢు.
దీనిని బట్టి శ్రీ సాయి పరిశుద్ధ పరమేశ్వర అవతారం అని మనకు స్పష్టంగా అవగతమౌతోంది. ఇప్పుడు శ్రీ శిరిడీ సాయినాధుని సత్య స్వరూపం గురించి శ్రవణం చేద్దాం. : 'ప్రకాశైక స్వరూపుడు, జనన మరణ చక్ర భ్రమణాలకు అతీతుడు, నిత్య ప్రకాశకుడు, పరమ పవిత్రుడు, విశుద్ధ విజ్ఞాన ఘన రూపుడు, నిరాకారుడు, నిర్గుణుడు, త్రిగుణాతీతుడు, పరిపూర్ణుడు, ఆనంద స్వరూపుడు, క్రియా రహితుడు, నిరాకార పరబ్రహ్మం, మాయాతీతుడు, స్వప్రకాశకుడు, కాలాతీతుడు, సర్వ వ్యాపకుడు, అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్య జ్ఞాన సాగరుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, నిర్మలుడు, వాగాతీతుడు, అమృత స్వరూపుడు, శాశ్వత ఆత్మ స్వరూపుడు'
ఆయనే స్వయంగా ఒక సందర్భంలో ఒక భక్తునితో 'నేను పుట్టినప్పుడు కొడుకు పుట్టానని మా అమ్మ ఎంతో పొంగిపోయింది. అది చూసి ఆమె నన్ను కన్నది ఎప్పుడు ? ఆమె కన్న ముందు నేను లేనా ? అందుకు ఆమె ఎందుకంత ఆనందపడుతోందో నాకు అర్ధం కాలేదు అని ఆశ్చర్యపోయాను' అని అన్నారు. దీనిని బట్టి శిరిడీ సాయినాధుడు అయోనిజ సంభవుడని, జనన మరణాలకు అతీతమైన ఆత్మ స్వరూపమని అర్ధమౌతోంది కదా! అందుకే శ్రీ సాయి వివిధ భక్తులకు వారు కోరిన రూపాలలో దర్శనం ఇచ్చి ఎన్నో సందర్భాలలో తన సర్వజ్ఞతను చాటారు.
ఈ కలియుగంలో 19వ శతాబ్దంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కోసం సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే ఒక మానవ దేహం దాల్చి దివి నుండి భువికి దిగి వచ్చింది.
సాయి భక్తులారా! అర్థమయ్యిందా మన సాయి నిజ సత్య స్వరూపం ఏమిటో? ఎన్నో లక్షల సంవంత్సరాలలో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మలో సాయి భక్తులం కాలేం అన్నది నిర్వివాదాంశం. ఆ భాగ్యం మనకు లభించింది. కనుక మన సద్గురువు పట్ల మనకు గల సంకుచిత భావాలను వదిలించుకొని అత్యున్నతమైన భావం పెంపొందించుకొని, సదా ఆయననే ఆరాధిద్దాం. ఈ కలి కల్మషంలో పాప కార్యాలు చేయక, అపారమైన పుణ్యం సాధించుకొని మోక్షం కొరకు కృషి చేద్దాం.
శ్రీ సాయినాధుని ఈ విధమైన ఉన్నత భావాలతో ఉపాసన చేస్తే తొందరగా సాయి కృపకు పాత్రులమై అతి దుర్లభమైన పరమ శాంతిని పొందగలం.
సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణమస్తు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|