|
|
Articles: Devotion | గురువు ఆజ్ఞా పాలన - Mr. Pratap Cherukuri Pratap
| |
ఆధ్యాత్మిక జీవితం మిక్కిలి నిగూఢమైనది, కష్టతరమైనది. ఆచి తూచి అడుగులు వేయకపోతే ఆవేదన, అశాంతి, ఆందోళన తప్పవు. ఇతర మార్గాల్లా కాక అధ్యాత్మిక జీవితంలో మార్గదర్శి తప్పనిసరి. సర్వ సమర్ధులైన గురువు మార్గదర్శకత్వంలోనే సాధకుడు అనుక్షణం సంశయ నివృత్తి పొందుతూ, సాధన, అనుష్టయాలను చక్కగా నిర్వర్తిస్తూ లక్ష్యాన్ని చేరగలడు. లేకపోతే ఏ క్షణమైనా వక్రమార్గం పట్టడమో లేక భ్రాంతి, మోహం అనే సుడిగుండంలో పడడమో జరుగుతుంది. దారి చూపే వారు లేక తీవ్రమైన అశాంతికి లోనవుతారు. కొందరు ఈ మాయలో పడి నాస్తికులుగా మారిన వైనం కూడా ఉంది. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో సర్వ సమర్ధుడైన సద్గురువు ఆవశ్యకత గురించి గురు గీత స్పష్టంగా తెలియజేసింది.
ఈ కలియుగంలో మిడిమిడి జ్ఞానంతో, ఆత్మ సాక్షాత్కార అనుభూతి లేకుండా అహంకార పూరితులైన కొందరు గురువులు - సద్గురువులు - పరమ గురువులు, జగద్గురువులు అంటూ బిరుదులు తగిలించుకుంటూ ప్రచారం చేసుకుంటారని, వారిని నమ్మకుండా, జాగ్రత్తగా, వివేకంతో చరించమని పరాశర మహర్షి ద్వాపరయుగంలోనే సాధకులను హెచ్చరించారు. హెచ్చరించిన విధంగానే ఎందరో ఆధ్యాత్మిక పరిపక్వత లేని వారు కలి ప్రభావానికి లోనై గురువులుగా తెర మీదకు వచ్చారు. విభిన్న సిద్ధాంతాలు, సాధనా మార్గాలు, ప్రచారాలు చెయ్యడం మొదలుపెట్టారు. కొందరైతే పూజాది కార్యక్రమాలను చేయనవసరం లేదని, భగవంతుడిని నిరాకార రూపంలో ధ్యానించమని, విగ్రహారాధన చేయవద్దని, ముద్రలను వేయించుకొని ధ్యానం మాత్రమే చేయమని, ఇలా విభిన్న రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ అవివేకపు సిద్ధాంతాలు. అతి సనాతమైన మన సాంప్రదాయాలకు విరుద్ధం. ఈ మధ్యకాలంలో కొందరు గురువులు సేవ, పాప ప్రక్షాళనల పేరుతో శిష్యుల నుండి ధనాన్ని విపరీతంగా వసూలు చేస్తున్న సంధర్భాలు కూడా వెలుగు లోనికి వచ్చాయి.
రోజుకో గురువు, సిద్ధాంతం ప్రచారం లోనికి వస్తుండడంతో సాధకుడు దేనిని నమ్మాలి, ఏ మార్గంలో పయనించాలి అన్న గందరగోళానికి గురవుతున్నాడు. ఈ సందర్భంలో సాధకుని ఆధ్యాత్మిక జీవితంలో సర్వ సమర్ధుడైన, సర్వజ్ఞుడైన, కరుణామయుడు, సర్వ శక్తిమంతుడైన సారథి అవసరం ఎంతైనా ఉంది. ఆ సారథి సారథ్యంలో ఎలాంటి సంశయమూ లేక దిక్కులు చూడక సూటిగా నడిస్తే గమ్యం వైపు శీఘ్రమే చేరవచ్చు.
ఈ కలియుగంలో అతి సమర్ధుడైన సారథి శ్రీ శిరిడీ సాయినాథుడు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. నిరాకార పరబ్రహ్మ అవతారం. ఈ సృష్టి అంతటికీ సద్గురువు. అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడు, యోగిరాజ శ్రేష్టుడు. కోట్లాది మందిని కరుణించి, శ్రేయోమార్గంలో నడిపించిన అపూర్వ పరమ గురువు. సాయికి సాటి రాగల అవతార పురుషుడు భూత, భవిష్య, వర్తమాన కాలాలలో ఇక రారు. భక్తులకు ఎలాంటి కఠోర నియమ నిభంధనలూ విధించకుండా ప్రేమపూరితుడై సదా కరుణించడమే ఆయన కర్తవ్యం. ఎన్నో వేల జన్మలలో పుణ్యం చేసి, దైవానుగ్రహం పుష్కలంగా లభిస్తే తప్ప ఈ జన్మలో సాయి దర్శనం, అనుగ్రహం కలుగదు. అది కలిగిన తర్వాత ఆ గురుదేవుల బోధనలను సంపూర్ణంగా తెలుసుకోవడం, వాటిని తు చ తప్పక ఆచరించడమే మన తక్షణ కర్తవ్యం. ఎవరైతే సాయి బోధనలను సంపూర్ణంగా అవగతం చేసుకొని, వాటిని త్రికరణశుద్ధిగా పాటిస్తారో వారే అతి శీఘ్రంగా సాయి కరుణా కటాక్షాలకు పాత్రులౌతారు.
సంశయ మనస్థత్వంతో గురుదేవులను విశ్వసించని వారికి ఆ సాయి సన్నిధిలో వేలాది సంవత్సరాలు నివసించినా లవలేశమైనా అనుగ్రహం కలుగదు. గురు బోధలను ఆచరించని వారికి గురు అజ్ఞా ధిక్కారపు పాపం చుట్టుకుంటుంది. జన్మ జన్మలకూ ఈ పాపభూయిష్టమైన జీవిత చక్రంలో కొట్టుమిట్టాడుతునే ఉంటారు. కాబట్టి ఈ జన్మలో సాయిదేవుని శిష్యులయ్యే భాగ్యాన్ని అర్ధం చేసుకొని సాయి బోధలను తెలుసుకొని, వాటిని తు చ తప్పకుండా ఆచరించాలి. లేకపోతే సాయి చెప్పిన మామిడిపూత వలే మధ్యలోనే రాలిపోతాం. ఆధ్యాత్మిక జీవితపు గందరగోళంలో కొట్టుమిట్టాడుతునే ఉంటాం.
సర్వం శ్రీ శిరిడీ సాయినాథ పాదారవిందార్పణమస్తు!
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|