|
|
Articles: TP Features | 'చౌక'గా చంపుతాయ్! - Site Administrator
| |
(రమేష్ రామడుగు)
న్యూఢిల్లీలో పనిచేస్తున్న పాకిస్తాన్ దౌత్యాధికారి మొహబత్ ఖాన్ అఫ్రిది ఇటీవల స్నానాల గదిలో కరెంట్ షాక్ తో చనిపోయారు! ఈ వార్త చదవగానే 'షరా మామూలు'గా మరో వార్తా పఠనానికి వెళ్తాం. కానీ... దౌత్యవేత్తల వంటి వారి నివాసాల్లో కూడా కరెంట్ వైరింగ్ నాసిరకంగా ఉంటుందా! అన్న సందేహం వస్తుంది. ఇంతకీ ఆయన.. హెయిర్ డ్రైయర్ వాడుతున్న సమయంలో 'షాక్'కు గురయ్యారు. ఇక్కడ 'నిజం' ఏమిటంటే... ఆయన వాడింది నాసిరకం హెయిర్ డ్రైయర్. మార్కెట్ లో అది చవకగా వచ్చిందేమో! కానీ... ఫలితం మాత్రం - ఆయన ప్రాణం!
ఇటీవల కాలంలో విద్యుత్ ఉపకరణాలు మార్కెట్లలో కుప్పలు తెప్పలుగా విక్రయిస్తున్నారు. అది.. సెల్ ఫోన్ కావచ్చు, చిప్ కావచ్చు, ఎఫ్ఎం రేడియోలు, డీవీడీలు, కంప్యూటర్లు ఏవైనా కావచ్చు. కంపెనీల విక్రయ ధర కన్నా అందుబాటు ధరలో సామాన్యులకు వీధుల్లో రాశులు పోసి మరీ విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ లోని కింగ్ కోఠీలో ఫుట్ పాత్ పై (అసెంబ్లింగ్) ఎఫ్ఎం రేడియోలు, అబిడ్స్ లో చౌకగా వచ్చే సెల్ ఫోన్ లు... ఒకటేమిటి... తక్కువ ధరకు లభించే ఎంపీ త్రీ ప్లేయర్లు, ఐ పాడ్ లు మనకు హాని చేయవచ్చు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉత్పత్తయ్యే అసెంబ్లింగ్ కంప్యూటర్లు, గీజర్లు, డ్రయ్యర్లు, ఎయిర్ కండీషనర్లు... ఇలా చాలా వస్తువులు మనకు తక్కువ ధరకు లభిస్తాయి. కానీ... విధి వక్రిస్తే... ప్రాణాన్ని బలి తీసుకుంటాయని చెప్పడానికి పాకిస్తాన్ దౌత్యవేత్త మరణమే సాక్ష్యం. చౌకగా దొరికే వస్తువులు వాడే అందరికీ అలాంటి స్థితే రాదన్న మాట నిజమేనని నమ్మినా... చాప కింద నీరు లాగా మృత్యు ఛాయ మాత్రం మన జీవితాల్లోకి చొరబడుతోంది. మన ఆయువుని తినేయడమో లేక అనారోగ్యాల్ని ప్రసాదించడమో ఖాయంగా ఉంటుంది. అందుకనే... చౌకగా లభించే నాసిరకం ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంలో జాగ్రత్త వహించాలని ఎలక్ట్రానిక్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|