|
|
Articles: TP Features | తెలుగు వారంతా ఒక్కటే - Mr. Tirumalarao Jayadheer
| |
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు క్రీస్తు పూర్వం నుండి వందల సార్లు మారుతూనే ఉన్నాయి. అలా మారడం చారిత్రక అవసరం. ఆ మార్పుల్ని చూడలేనివారు మాత్రమే పిడివాదులు. ఇలాంటి పిడివాద పెడధోరణుల వల్ల సమస్య మరింత జటిలం అవుతుందే తప్ప తగ్గదు. తద్వారా తెలుగు ప్రజల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. సాంస్కృతిక భాషా రంగంలో పనిచేసే వాళ్లు ఈ దూరాన్ని తగ్గించాలి. ప్రాచీన భాషా విషయంగానో, మరో నీటి సమస్య కారణంగానో లేదా ఉద్యోగ సంబంధిగానో మహారాష్ట్ర లేదా తమిళ రాజకీయ\ ప్రభుత్వాలతో పేచీ వచ్చినంత మాత్రాన మనం అక్కడి తెలుగు ప్రజలను దూరం చేసుకుంటామా. వాళ్ళు మన సోదరులు కాకుండా పోతారా?! అలాగే కాకతీయుల కాలం నుండి హైదరాబాద్ సంస్థానం పరిపాలన కాలం వరకూ తెలుగు సాహిత్యం, భాషలు ఒకటిగానే మసిలాయి. ఈ కోణాలకు ఏనాడూ ఎలాంటి వైషమ్యాల మకిలి అంటలేదు. అందుకే ఇరు ప్రాంతాల ప్రజలకు ఒకరి పట్ల మరొకరికి అన్నదమ్ముల అనుబంధం, ఆత్మీయతలు సజీవంగా ఉన్నాయి. వీటికి అవరోధం కలిగించడం తెలుగు భాషా జాతి భావనల వ్యతిరేకులకే సాధ్యం. వ్యవస్థీకృత ఆధిపత్య నల్లధనం మూలిగే తెల్ల కాలర్ నేరస్థుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం. ఇదే ధోరణి ఏ వైపునున్నా అది ఒక ప్రమాద సూచే!
ఇవాళ మనం రాష్ట్ర గీతలకావలి అమ్మలు, అక్కా చెల్లెళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. మగవాళ్ళు వృత్తి ఉద్యోగ సంబంధ పనుల్లో, సంపాదనలో తీరిక లేకుండా ఉంటారు. నిజానికి ఈ మహిళల ఆలోచనలేమిటి? వాళ్ళ సాంస్కృతిక అవసరాలేమిటి? వాటిని మనం తీర్చగలమా. మన తోబుట్టువులకిచ్చేదేమైనా ఉందా. ఆకాశంలో సగం అంటాం. కాని గీతలకావల ఉన్న సగం తెలుగు ఆకాశాన్ని మనం పూర్తిగా విస్మరించాం. ఎన్నడైనా ఓ పెద్దన్న వెళ్ళి వాళ్ళతో ఒక రక్షాబంధనం కట్టించుకున్నాడా. తల నిమిరి పుట్టింటి ప్రేమని పంచి ఇచ్చాడా.
మనం ఇప్పుడు గీతల కోసం మార్పుల కోసం ఆరాటపడుతున్నాం. ఇది సహజమే. అనివార్యమే. 1969 నుండి ఇది వటవృక్షంగా పెరిగి పెద్దదైన ఆకాంక్షే. ఇప్పుడు ఇరువైపులా పెద్దన్నలు ప్రేమ బంధాలతో ముందుపడాలి. ఇద్దరూ కలసి భూగోళమ్మీద తెలుగు జాతి నివసించే ఆనవాళ్ళని వెతకాలి. వారిని ఆప్యాయంగా గుండెలకు అదుముకోవాలి. ఈ జంట కర్తవ్యం మనల్ని మానసికంగా ఒకటి చేస్తుంది. రాజకీయ భౌగోళిక చిత్రపటాలు కాదు, జాతి చిత్రపటం, సాంస్కృతిక చిత్రపటాలు తయారుచేసి ప్రతి పాన్ షాప్ లో నిలపాలి. నిజానికి అవి మన మానసిక ప్రపంచంలో ఒక భాగం కావాలి. అప్పుడు తెలుగునేల శ్వాసించే గాలిలో సమైక్యత వెల్లివిరుస్తుంది. అంతే కాని, హెచ్చుతగ్గుల, అనుమానపు దృక్కుల గీతల్లో దశాబ్దాలుగా ఆరని మంటలే ఆవిష్కృతమవుతాయి. అందుకే ఇప్పుడున్న సంకెళ్ళ గీతల్ని చెరిపి ఒక సాంస్కృతిక సరిహద్దుని రూపొందిద్దాం. భౌగోళికంగా ఒకటి రెండైనా ఫరవాలేదు. మేమంతా ఒక్కటే అని జనసామాన్యానికి పిలుపునిద్దాం. విద్యుత్ లాభాలు నిండిన మెదడులు చిమ్మే విషపూరిత వాయువులని అరికడదాం. సామాన్య ప్రజలు అందులో పడి కాలే ప్రమాదం నుండి కాపాడుదాం.
ఇవాళ తెలంగాణ రాజకీయ అంశం కాదు. ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ. తెరపై ఆ యాసకి భాషకీ జరిగే అవమానాన్ని తెలుగు భాషీయులంతా ఎదిరించాలి కదా. మరి ఏ ఒక్క కమూ ఎందుకు ముందు పడలేదు. రాయలసీమ కక్షల్ని సినిమా పంచరంగులు కాసులు కోసం కక్కుర్తి పడితే తెలంగాణ రచయితలు ఖండించారు. కళింగాంధ్ర భాషను నీచపాత్రలకే అంటగట్టితే హెచ్చరించారు. మరి మహా పేరు పొందిన ఆంధ్ర భాషాభిమాన దురంధరులు తెర ముందు - వెనక ప్రబలిన ఆ ధోరణిని ఎందుకు నిందించలేదు. ఆ సినీ పెట్టుబడిదారులు చాలా మంది తమ ప్రాంతం వారైనందుకా?
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|