|
|
Articles: TP Features | కన్నడంలో 'దేవుడు' - Site Administrator
| |
దేవుడు నరసింహశాస్త్రిగారి పూర్వీకులు కంబాలూరు అనే చోటునుండి కర్నాటక దేశానికి వలస వచ్చారని చెప్పుకుంటారు. 1896 డిసెంబరు 29న జన్మించిన దేవుడు ఉన్నత పాఠశాలలో చదివే కాలంలోనే రామాయణ భారత భగవతాలు, పురాణాలు అన్నీ చదువుకున్నారు. 1912లోనే 'సాహసవర్మ' అనే నవలని రచించారు. మైసూరులోని మహారాజా కాలేజీలో చదువుకునేటప్పుడు దేవుడు గారికి సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు తత్త్వశాస్త్రం బోధించారు. సాహిత్యం, వేదాంతం, కన్నడ, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో పరిణతిని సాధించారు దేవుడు. ఎం.ఎ.పట్టా సంపాదించిన తర్వాత మైసూరులోని సద్విద్యా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులయ్యారు. అయితే ఆయన దానిలో ఇమడలేకపోయారు. ఉద్యోగం లోంచి తప్పుకొని స్వతంత్ర జీవితాన్ని గడపవలసిందింగా తిరుమల తాతాచార్యశర్మ, సిద్ధవనహళ్ళి కృష్ణశర్మ (వీరిద్దరు కూడా తెలుగువారే, కన్నడం లో గొప్ప రచయితలుగా పేరు పొందారు) ప్రోత్సహించారు.
బెంగుళూరికి వచ్చిన దేవుడు గారు గాంధీనగర ఉన్నత పాఠశాలను స్థాపించారు. అక్కడ వారు ప్రవేశపెట్టిన బోధనా పద్ధతుల్ని ఈనాటికీ చెప్పుకుంటారు. పత్రికారంగానికి దేవుడు గారు చేసిన సేవలని కూడా చెప్పుకోవాలి. కన్నడ పత్రికారంగంలో భీష్మునిగా పేరు పొందినవారు తిరుమల తాతాచార్యశర్మ గారు (వీరు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి బంధువులు, వైష్ణవులైనా రాళ్ళపల్లి వారి లాగానే స్మార్తులలాగా 'శర్మ'గా మారారు). తిరుమల తాతాచార్యశ్మగారి సాహచర్యంలో దేవుడు గారు కూడా పత్రికా రంగానికి ఎనలేని సేవ చేశారు.
పత్రికారంగంలో దేవుడు గారి సేవ ముఖ్యంగా పిల్లల పత్రికలకు సంబంధించినది. పిల్లలకు నచ్చే విషయాలను మనసుకు హత్తుకునేలా చెప్పటంలో ఆయనకు సాటి ఎవరూ లేరంటారు. 'మక్కళ పుస్తక' (పిల్లల పుస్తకం) అనే మాస పత్రికకు ఆయన సంపాదకులుగా పనిచేశారు. తర్వాత 'నమ్మపుస్తక' (మన పుస్తకం) అనే మాసపత్రికను ప్రారంభించారు. పిల్లలకు సంబంధించినంతవరకు ఇలాంటి పత్రిక ఇప్పటి వరకు రాలేదంటారు. ఈ పత్రికలో బాలల విభాగం, తల్లిదండ్రుల విభాగం, విద్యార్థుల విభాగం అని మూడు భాగాలుండేవి. పిల్లల విజ్ఞానానికి దోహదం చేసే అన్ని విషయాలూ ఈ పత్రికలో ఉండేవి. పత్రికలను నడపడంతో బాటు పిల్లల కోసం కథలు, వ్యాసాలు మొదలైనవి రాయటంలోనూ దేవుడు గారు అందె వేసిన చేయిగా ఉండేవారు.
కన్నడ నవలారంగంలో దేవుడు గారి కీర్తి అజరామరమైంది. సాంఘిక నవలలు, కాల్పనిక నవలలు రచించినా ఆయనకు పౌరాణిక నవలాకారునిగానే ఎనలేని కీర్తి లభించింది. 'మహాబ్రహ్మణ', 'మహాక్షత్రియ', 'మహాదర్శన' అనే పేర్లతో ఆయన రచించిన పౌరాణిక నవలాత్రయం 'దేవుడు' అంటే 'పౌరాణిక నవలా రచయిత' అనేంతగా పేరు తెచ్చి పెట్టాయి. ఈ నవలల కోసం ఆయన చేసిన పరిశోధన, పరిశ్రమ, సాధన అపూర్వమైనవి. ఆయనే చెప్పినట్లు ఈ రచనలు 'కథ అనుకున్నవారికి కథలు, శాస్త్రమనుకునే వారికి శాస్త్రాలు, విద్య అనుకునే వారికి విద్యలు.'
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|