|
|
Articles: TP Features | రాష్ట్రంలో రాజకీయ మాంద్యం - Mrs. lakshmi cherukuri
| |
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనే కాకుండా పొత్తుల విషయంలో కూడా తన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ భవితవ్యానికి ఈ ఎన్నికల ఫలితాలు పెద్ద సవాల్గా మారనున్నాయి.. ఆయన పైకి ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా మహాకూటమి ఏర్పాటు, ప్రజారాజ్యం ప్రభావం ఆయనను కలవరపెడుతున్నాయి. ప్రజాకర్షక పథకాలు, అభివృద్ధి మంత్రం ప్రతిపక్షాల ప్రభుత్వ అవినీతి ప్రచారం ముందు పనిచేస్తాయో లేదోనన్న కలవరపాటు కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది. ప్రతిపక్షాల వాగ్దానాల ముందు తమ అభివృద్ధి నినాదం నిలుస్తుందో లేదో అన్న భయం వెంటాడుతోంది. తెలంగాణా కాంగ్రెస్ నాయకులను లెక్కచేయకుండా ఆయన చూపించిన ఏకపక్ష ధోరణి పార్టీ అధికారంలోకి రాకపొతే అనేక ఇబ్బందులను తెచ్చి పెట్టటమే కాకుండా పలుకుబడి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. పార్టీలోని అనేక వర్గాల విమర్శలను ఇప్పటికే ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నాయకత్వ ఆధిపత్యం పూర్తిగా తెరమరుగయ్యే పరిస్థితి ఉంది.
తెలుగుదేశం పరిస్థితి చూస్తే అతి కష్టం మీద మహాకూటమిని ఏర్పాటుచేసి ఎన్నికలలో పోటీ చేసిన ఫలితాల తర్వాత కూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి తమటో ఉంటుందో లేదో అన్న ఆందోళన ఒకవైపు, అధికారానికి కావలిసిన సంఖ్య సాధిస్తామో లేదో అన్న భయం మరొక వైపు కనపడుతోంది. పార్టీలో సీనియర్ నాయకుల నిష్క్రమణలు, ప్రజారాజ్యం పార్టీలోకి వలసలతో కొట్టుమిట్టాడిన పార్టీకి ఎన్.టి.ఆర్. నట వారసుల చరిష్మాని ప్రచారానికి ఉపయోగించుకొని, నగదు బదిలీ, కలర్ టీవీల పంపిణీ పథకాలతో ఎన్నికల సమయానికి కొంత బలం పుంజుకున్నట్లు అనిపించింది. అయినా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే కూటమిలోని ప్రధాన భాగస్వామి పార్టీ ఎన్.డి.ఏ కూటమిలో చేరిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అసలు థర్డ్ఫ్రంట్ విచ్చిన్నమయ్యే పరిస్ధితులు ఒక వైపు, లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ వైపు వెళ్ళే సూచనలు మరొక వైపు కనిపిస్తూ ఉండటంతో ఫలితాలు వెలువడే వరకు ఏమీ మాట్లాడలేని పరిస్ధితులు నెలకొన్నాయి.
ఇక ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ చర్చ తర్వాత చిరంజీవి పార్టీని ఆర్భాటంగానే స్థాపించారు. చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు కూడా మంచి స్పందనే కనిపించింది. భారీగా తెలుగుదేశం పార్టీ నుండి వలసలు కూడా జరిగాయి. కాని ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో మొదలైన అసంతృప్తుల బెడద టిక్కెట్ల కేటాయింపుతో తీవ్రమైంది. పార్టీ నాయకులు టిక్కెట్లు అమ్ముకొన్నారనే అపఖ్యాతితో పార్టీ బలహీనపడింది. ఎన్నికల సర్వేలు పార్టీకి వచ్చే స్థానాలు 20 నుండి 30 వరకే ఉంటాయి అని చెప్పడంతో గెలిచిన అభ్యర్థులనైనా ఎలా నిలుపుకోవాలనే ఆలోచనలో పడింది. మొదటిసారిగా రాష్ట్రంలో హంగ్ ఏర్పడవచ్చు అనే ఊహాగానాలతో ఎన్ని స్థానాలు వచ్చినా చిరంజీవి పాత్ర కీలకం అయ్యే పరిస్థితి వస్తే ఫలితాలు తర్వాత రాష్ట రాజకీయాలను తామూ ప్రభావితం చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల తర్వాత కూడా జాతీయ రాజకీయాల ప్రభావం, రాష్ట్ర రాజకీయ అనిచ్చిత స్థితి మరికొన్ని రోజులు కొనసాగే ఆవకాశం ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|