|
|
Articles: My Thoughts | బహునాయకత్వం - Site Administrator
| |
'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' (డబ్యు.డబ్యు.ఎఫ్) నీటి విధానాల సలహాదారు గుజ్జా భిక్షం, ఒకసారి పోలవరం కోర్టు కేసు కాగితాలు కావాలని అడిగారు. 'ఎవరు వేసిన కేసులో కాగితాలు' అని నేను ప్రశ్నిస్తే 'అవన్నీ ఒకే కేసు కాదా!' అని ఆయన తెల్లబోయారు. ఎవరిదోవన వారు ప్రజాహిత వ్యాజ్యం వేయడం, ఎవరికి తోచినట్లు వారు వాదించడం, చివరకు ఏదో తీర్పు రావడం, వీరోచిత పోరాటం చేసినట్లు ఉద్యమకారులు చాటుకోవడం పరిపాటిగా మారింది. చాలా తీర్పులు ప్రభుత్వ చర్యలకు కోర్టు మద్దతును సమకూరుస్తున్నాయి. 'సమత' కేసు ప్రకారమే మన రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాన్ని ప్రభుత్వ కార్పొరేషన్ కు అప్పగిస్తున్నట్లు పేర్కొంటూ జారీ చేసిన ఉత్తర్వులు ఇందుకు ఉదాహరణ.
స్టే రాగానే వచ్చే ప్రచారంతో సంబరపడిపోయి తమ ఆదేశాల అమలును సమీక్షించడానికి కోర్టు పూనుకొన్నప్పటికీ, తరువాత కేసును పట్టించుకోని సందర్భాల సంఖ్య కూడా తక్కువేం లేదు. సూరంపాలెం పునరావాసం కేసు ఈ కోవకు చెందినదే. న్యాయవ్యవస్థను గాడిలో పెట్టే విమర్శకులు లేకపోవడం మన దురదృష్టం. భోపాల్ గ్యాస్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుమీద నాటి ఇండియన్ లా ఇన్సిస్టిట్యూట్ అధినేత శ్రీ ఉపేంద్రబక్షీ చేసిన విమర్శలకు స్పందిస్తూ - ఆ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో తానుకూడా ఉన్నందుకు న్యాయమూర్తి వెంకటరామయ్య విచారం ప్రకటించిన ఒక్క సందర్భమే ఇందుకు మినహాయింపు. ఈ విచారం వల్ల జనానికి ఒరిగిందేం లేదు.
'గుళ్ళో హాజరు ప్రతి శనివారం, గూడుపుఠాణీ ప్రతి ఆదివారం' అన్నట్లు రెండురోజులు ఊళ్ళు తిరగడం, నాలుగు కాగితాలు ఎక్కడో సంపాదించడం, కోర్టులో కేసు వేయడం, వార్తల్లో కనిపించడం, వీళ్ళేదో చక్రం తిప్పుతున్నారని పిచ్చిజనం చివరకు నష్టపోవడం - ఇదీ జరుగుతున్న చరిత్ర. ఈ తతంగం చూస్తుంటే బాధాకరమైన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. 1981 లో అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గుమిగూడిన గిరిజనుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. గిరిజనుల పూజారి, ఒకానొక చోటుచుట్టూ మంత్రంవేశానని, దాంట్లోకి తుపాకి గుండ్లు దూసుకుపోలేవని చెప్పాడట. అతని మాటలు నమ్మి ఎక్కువమంది ఆ చోటుకు చేరారు. అక్కడే కాల్పులకు ఎక్కువగా బలైనారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|