|
|
Articles: TP Features | వలసవాద ఆలోచనకు ఆవల - Site Administrator
| |
తెలుగు నేలపై గ్రాంథిక వ్యవహారిక భాషోద్యమాలు వచ్చినట్లే ప్రాకృత సంస్కృత భాషల గురించి ఆనాడు ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. గ్రాంథిక భాషలోనే కాదు. వ్యవహార భాషలో గ్రంథాలు రాసి ప్రచారం అయినట్లుగానే ఆనాటి దేశీభాష అయిన ప్రాకృతంలో ఎన్నో వందల రచనలు వెలువడినాయి. అత్యంత సృజనశక్తితో రచించిన గ్రంథాలూ ఉన్నాయి. పైశాచీ భాషలో సైతం రచనలు వచ్చాయి. మొదట ఈ భాషలే ప్రచారంలో ఉండేవి. ఈ భాషల నుండి సంస్కరింపబడిన భాషే సంస్కృతం అని కొందరన్నారు. వీటిలో ఏది మాతృక? ఏది పుత్రిక? అని వాదోపవాదాలు జరిగాయి.
ఆది నుండీ ప్రాకృతమే అసలు మాతృక. ప్రజలలోని నానా ప్రకృతుల అనియత వ్యవహారంలో ఉన్న భాషను సంస్కరించి నిర్మించిన భాషే సంస్కృతం అని కొందరన్నారు.
ఆద్య బ్రహ్మణ: గీర్వాణం కాబట్టి సంస్కృతమే మాతృక. అందుకే గీర్వాణ భాష అయిందని కొందరి భావన.
పంచాగ్నుల వారు వీరిరువురి వాదాలను, వారి తర్కాల గురించి సవివరంగా, ఉదాహరణలతో సహా రాశారు.
ప్రాకృత భాష నీడ చేతే సంస్కృతపు మాటలకు లావణ్యం ఉన్మీలితం అవుతుందని గౌడవధ కావ్యం రాసిన మహాపండితుడు వాకృతిరాజు అన్నాడు.
సర్వభాషలూ ప్రాకృతంలో చేరినవే అనీ, అందులో నుండే వివిధ భాషలు ఏర్పడ్డాయనీ, జలాలు సముద్రాల్లోంచి సూర్యకిరణాల ద్వారా పైకి ఆకర్షింపబడి మేఘ రూపంతో వేరైపోయినట్లే సంస్కరించుకున్న కారణం వల్ల ప్రత్యేకంగా నాగరిక భాషలుగా మారాయని అన్నాడు. నాగరిక భాషను ప్రజలు వాడితే మేఘరూపంలో ఉండేనీరు భూమి మీద వర్షింపక తప్పనట్లు, వర్షిస్తే మళ్ళీ సముద్రంలోకి ప్రవేశింపక విధి లేనట్లు, ఆ సంస్కరింపబడిన నాగరిక భాషలు కూడా నిరంతర వ్యవహారం వల్ల మళ్ళీ మారిపోయి ఎప్పటి పద్ధతిలో ప్రాకృతంగా ఏర్పడక తప్పవనీ, జీవద్వ్యవహారంలో ఉండే భాషల రీతులన్నీ ఇంతేనని చెప్పాడు. భాషా విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని కాబట్టి ప్రాకృతమే మాతృక సంస్కృతమే పుత్రిక అని స్పష్టంగా యోగవ్యాకరణ శాస్త్రజ్ఞుడు వ్యాకరణ భాష్యంలో సుశబ్ద, అపశబ్ద విచారణ సందర్భంలో చెప్పాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|