|
|
Articles: TP Features | కర్త, కర్మ, క్రియ కేసీయారే - Site Administrator
| |
తెలంగాణ రచయితలు, మేధావులపై గ్రామీణ ప్రాంతాల్లో యువతపై తీవ్ర నిర్భంధం కొనసాగుతూ వచ్చింది. దాన్ని ప్రశ్నించే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. ఆ వెసులుబాటు తెరాస కల్పించింది. ఆ స్ఫూర్తి, ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి తెరాసలో కొనసాగాలనేది తెలంగాణ ప్రజల అభిమతంగా ఉంటూ వచ్చింది. తెలంగాణ ప్రజల తక్షణ సమస్యలను పట్టించుకోవడం తెలంగాణ రాష్ట్ర సమితి మానేసింది. ప్రముఖ వాగ్గేయకారుడు గూడ అంజయ్యపై సిపిఎం కార్యకర్తలు దాచి చేసినప్పుడు పట్టించుకోవడానికి తెరాస శాసనసభ్యులు నిరాకరించారు. అంతకన్నా పెద్ద విషయాలు తమ వద్ద ఉన్నాయని తెరాస శాసనసభ్యులు బుకాయించారు. తెరాస భావ ప్రసారం వల్ల, భావోద్వేగం వల్ల మనుగడ సాగిస్తూ వస్తోందనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు విస్మరించారు. ఇలా తెలంగాణ కవులు, రచయితలు, మేధావులు ఒక్కొరొక్కరే నిష్క్రియాపరులు అవుతూ వచ్చారు. అంటే తటస్థ మేధావుల పాత్ర తగ్గుతూ వచ్చింది.
ఎన్ని తెలంగాణ పార్టీలు వచ్చినా, విజయశాంతి 'తల్లి తెలంగాణ' పార్టీ పెట్టినా, దేవేందర్ గౌడ్ 'నవ తెలంగాణ' పార్టీ పెట్టినా తనకేమీ ఢోకా లేదని అతి విశ్వాసాన్ని కేసిఆర్ ప్రదర్శిస్తూ వచ్చారే తప్ప, సారంలో స్ఫూర్తి కొరవడుతూ వస్తోందనే విషయాన్ని ఆయన గమనించలేదు. అలా గమనించి, ముందుకు సాగడానికి అనువైన వాతావరణాన్ని ఆయన కల్పించుకోలేదు. ఆయన చేసిన ప్రతి పనిని సమర్థిస్తూ వచ్చే ఒక బృందం పార్టీలోనూ, మేధావి వర్గంలోనూ తయారైంది. పార్టీకి సంబంధించిన ఆయన కోటరీ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చినప్పటికీ మేధావులు, రచయితలు మాత్రం మారలేదు. ఇన్నయ్య, వి.ప్రకాశ్ వంటివారు పార్టీ నుంచి వెళ్ళిపోగానే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేశారు.
యుపిఎకు మద్దతు ఉపసంహరించుకున్న మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు సవాల్ కు ప్రతిస్పందించి రాజీనామా చేసి కెసిఆర్ కరీంనగర్ లోక్ సభకు ఉపఎన్నికను ఆహ్వానించారు. ఆ ఎన్నికల్లో కెసిఆర్ ఘనమైన మెజారిటీతో విజయం సాధించారు. దాంతో తనకు తిరుగులేదనే భావనకు ఆయన గురయ్యారు. అప్పటివరకు కెసిఆర్ బహిరంగ సభలు జనసందోహంతో ఉర్రూతలూగుతూ వచ్చాయి. కరీనంగర్ లోక్ సభ ఎన్నికల్లో తెరాసతోనూ, కెసిఆర్ తోనూ సంబంధం లేని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, న్యాయవాదులు, రచయితలు ఇంటింటికీ తెలంగాణ నినాదాన్ని చేరవేశారు. అప్పటి నుంచే కెసిఆర్ కోసం కాదు, తెలంగాణ ఉద్యమం కోసం ఓటేయండనే నినాదం బలం పుంజుకుంటూ వచ్చింది. కెసిఆర్ పై, ఆయన వ్యవహారశైలిపై ఎంతగా వ్యతిరేకత ఉన్నప్పటికీ తెరాసను తెలంగాణ ఉద్యమం కోసం గెలిపిస్తూ వచ్చారు. కరపత్రాలు, లఘు పుస్తకాలు లక్షలాదిగా కరీనంగర్ లోక్ సభ స్థానంలో పార్టీతో సంబంధం లేకుండా పంచారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ అది నిజం.
లోక్ సభ, శాసనసభా స్థానాలన్నింటికీ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చేసరికి ఆ స్ఫూర్తి చాలావరకు సమసిపోయింది. అప్పటికే వామపక్ష మేధావులు, కార్యకర్తలు తెరాసకు దూరమయ్యారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా ఒక రాజకీయ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దాంతో తెరాస కొంతమేరకు ఆ ఎన్నికల్లో దెబ్బతినక తప్పలేదు. 2009 శాసనసభ, లోక్ సభ ఎన్నికల నాటికి దాదాపుగా కెసిఆర్ పూర్తిగా తటస్థ మేధావుల మద్దతు కోల్పోయారు. వారు పూర్తిగా చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన పరిస్థితులను తెలిసో తెలియకో కెసిఆర్ కల్పించారు.
స్వతంత్రంగా పనిచేసే సాహిత్య సాంస్కృతిక సంస్థలన్నింటినీ దెబ్బతీసి కెసిఆర్ పంచన చేరే సంస్థల మనుగడ పూర్తిగా ఉనికిలోకి వచ్చింది. సాంస్కృతిక వేదికను దెబ్బతీసి తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. అలాగే తెలంగాణ సాంస్కృతిక భిన్నత్వాన్ని, వైశిష్ట్యాన్ని చాటిన తెలంగాణ సాంస్కృతిక వేదికను దెబ్బతీసి తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. అలాగే తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పడింది. ఇలా కెసిఆర్ అనుబంధ సంస్థలు కనుమరుగయ్యాయి. తెరాసకు దగ్గరగా ఉంటూనే, అంతదూరం పాటించాలనే తెలంగాణ మేధావులకు పని లేకుండాపోయింది. తెలంగాణ సంస్థల పేరు మీద నలుగురైదుగురు మాత్రమే చెలామణి అవుతూ మిగతా తెలంగాణ మేధావులను, రచయితలను నిష్క్రియాపరులను చేశారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|