|
|
Articles: TP Features | మహిళల పాలిట కల్పవృక్షం - Site Administrator
| |
విద్యా వైద్య రంగాలలో సేవలతో పాటు మహిళలకు స్వావలంబన కలిగించే అనేక పథకాలు చేపట్టిన ఈ ధీరశాలి, గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. ఆమె చేపట్టిన కార్యక్రమాల ద్వారా లభించిన కీర్తి ప్రతిష్ఠలను మాత్రం అందరికీ పంచింది. తను, నేను అని కాక మేము, మనం అనే విలువలను పెంపొందించి ఆచరణలో పెట్టిన ప్రతిభాశాలి దుర్గాబాయి.
స్వాంతంత్ర్య సమర యోధురాలిగా గాంధీ స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం చేసి, బులుసు సాంబమూర్తి, కాశీనాధుని నాగేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నతులను మద్రాసులో ఉప్పు సత్యాగ్రహం చేయడానికి ఒప్పించి విజయవంతంగా సత్యాగ్రహ సమరం చేసింది. తాను నాయకత్వం వహించి మూడుసార్లు జైలుశిక్ష కూడా అనుభవించింది. పోలీసుల లాఠీ దెబ్బలకు చేతులు రక్తసిక్తమైనా ఒళ్ళు హూనమైనా చలించలేదు.
ఇంతటి విశిష్టత కలిగిన దుర్గాబాయి జీవితం నుండి నేటి బాలబాలికలు, యువతీ యువకులు, రాజకీయవేత్తలు, పరిపాలనా వేత్తలు, సంఘసేవకులు, సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఎంతో నేర్చుకోవాలి. సమాజం పట్ల, సమాజ శ్రేయస్సు పట్లా మన జాతి సంస్కృతీ సంపద పరిరక్షణ వికాసం పట్లా ముఖ్యంగా బాలలు, మహిళలు మొదలైన అమూల్యమైన మానవ వనరులను నాణ్యమైన వనరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ తమకు గల బాధ్యతను గుర్తించవలసి ఉన్నది.
జాతి, కుల, మత ప్రాంత వివక్షలకు అతీతంగా మనుషులుంతా ఒక్కటే అని, ఎటువంటి వివక్ష కూడదని తన కొరకు మాత్రమే స్వార్థంతో జీవించడం కాకుండా మొత్తం సమసమాజ నిర్మాణానికి, జాతి ఐకమత్యానికి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలనే ఆమె తన జీవన ప్రస్థానంలో అనేక పాత్రలు నిర్వహించి చాటి చెప్పారు. చేసి చూపెట్టారు. సమాజ సేవకురాలిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా, దీనజన రక్షకురాలిగా, గ్రంథకర్తగా, సంపాదకురాలిగా, ముఖ్య సంపాదకురాలిగా ఎన్నెన్నో పాత్రలను ఆమె సమర్థవంతంగా పోషించారు. ఆమె జీవించిన ప్రతిక్షణం తాను నమ్మిన విలువల సాకారానికే కృషి చేశారు. మన దేశ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన వారిలో అగ్రగణ్యుల కోవకి చెందుతారు దుర్గాబాయి.
దుర్గాబాయి నాటిన ఆంధ్ర మహిళాసభ అనే సేవా సంస్థ మహావృక్షమై శాఖోపశాఖలుగా విద్యా, వైద్యాలయాల రూపంలో విస్తరించింది. ఆమె జీవితమూ, సేవా మనకు ఆదర్శం కావాలి. మనం ఇంకా అధిగమించవలసిన మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి. నిర్దేశించుకున్న గమ్యం చేరడానికి చిత్తశుద్ధితో సేవా తత్పరతతో ప్రతిఒక్కరూ నడుంబిగించాలి. అప్పుడే దుర్గాబాయికి మనం సరైన నివాళిని అర్పించినట్లు అవుతుంది. మనలోని ప్రతి ఒక్కరూ ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొందాలి. ఆంధ్ర మహిళా సభ సేవలు దిగంతాలకు విస్తరించాలి. `సర్వేజనా: సుఖినో భవన్తు' అనే మహత్తర సూక్తి సాకారం కావాలి. అందుకు ఆంధ్ర మహిళా సభ సంస్థలే కాక ప్రతిఒక్కరూ ఆమె జీవితం నుంచి స్ఫూర్తి పొంది కర్తవ్యోన్ముఖులు కావాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|