|
|
Articles: My Thoughts | బహునాయకత్వం - Site Administrator
| |
కొందరు సామాజిక స్పృహ కలిగిన నగరవాసులు 'నిజనిర్ధారణ సంఘాలు'గా ఏర్పడి బాధితుల కష్టనష్టాలు గమనించి పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం 1970 నుండే ప్రారంభమైంది. మాజీ న్యాయమూర్తులతో పీపుల్స్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి విచారణ జరిపి నివేదికలు ప్రచురిస్తున్నప్పటికీ, ప్రభుత్వం లెక్క చేయడం లేదు. జాతీయ మానవహక్కుల కమిషన్ తాను స్వయంగా నియమించుకొన్న రాపోర్టీర్ ల నివేదికలనే బుట్టదాఖలు చేస్తుంది. పశ్చిమగోదావరి గిరిజనుల భూపోరాటం మీద మాజీ అధికారులు శంకరన్ ను, తమ రాపోవర్టీర్ కే.ఆర్.వేణుగోపాల్ లను అడిగి మరీ నివేదిక తెప్పించుకొని ఆ తరువాత పట్టించుకోలేదు. ఈ నివేదికలు పత్రికలలో వ్యాసాలుగా, పుస్తకాలుగా వేసుకోవడానికి పనికొస్తున్నాయి. ఈ కమిషన్ కు ఛత్తీస్ గఢ్ లో సల్వాజుడం అత్యాచారాల గూర్చి ఫిర్యాదు చేస్తే పోలీసు అధికారుల చేత విచారణ జరిపించి చేతులు దులుపుకుంది.
ఆహారభద్రత మీద సుప్రీంకోర్టు పరంపరగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆదిమ జాతులకు చెందిన గిరిజనులకు నూరుశాతం భద్రత ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా, పింఛన్ ల ద్వారా కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. కొందరు మాజీ అధికారులను కోర్టు కమిషనరులుగా నియమించింది. ఈ కమిషనర్ లు తమకు కొందరిని సహాయకులుగా ఏర్పరుచుకొన్నారు. ఈ కమిషనర్ లకు నేను ఒక వివరమైన నివేదిక పంపించాను. దాని ప్రతిని ఇందిరా క్రాంతిపధం ఉన్నతాధికారి విజయకుమార్ కు కూడా పంపించాం. కమిషనర్ హర్షమందర్ హైదరాబాద్ వచ్చినప్పుడు, సహాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్, నేను, ఆయన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శ్రీ కే.రాజును కలిసాం. శ్రీ రాజు వెంటనే సంబంధిత అధికారులతో టెలి (ఫోన్) కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. చేస్తున్నాం, చేస్తాం, చేయవచ్చు అంటూ అధికారులు చెప్పుకొచ్చారు. ఇంతే సంగతులు. ఈకేసును జాతీయ పౌరహక్కుల సంఘం (పియుసిఎల్) వేయడానికి ఆర్థిక సహాయం చేసిన 'యాక్షన్ ఏయిడ్' అనే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థకు హర్షమందర్ అధినేతగా ఉన్నారు. ఈ కేసును గోన్ సాల్ వెస్ నాయకత్వంలోని బృందం వాదిస్తున్నది. కొన్ని రాష్ట్రాలలో కొందరు గిరిజనతెగలలో కోర్టు ఆదేశాలు నూటికి నూరుపాళ్ళు అమలు జరిగినట్లు పత్రికలలో వ్యాసాలు వస్తుంటాయి. మన రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అని బాధపడడం తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ఇక ఆహార భద్రత చట్టం చేయాలని హడావిడి మొదలైంది. అప్పుడు చట్టం అమలుకావడంలేదు అంటూ ఆందోళన మొదలౌతుంది. ప్రజలగతి, చట్టం రాకముందు, వచ్చినాక అంతే.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|