|
|
Articles: My Thoughts | పంటలపై విదేశీ పెత్తనం - Site Administrator
| |
వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనాశాలలు, ఐసిఎఆర్ లాబ్స్ ముందు నేడు కనిపించేవి మన్ శాంటో, మైహైకోం సంస్థల వాహనాలే. ఆ సంస్థల ప్రతినిధులు ఈ లాబ్స్ లోకి యధేచ్ఛగా వెళుతున్నారు. పరిశోధనలకు నిధులు వారివి కాబట్టి ఎవరూ అభ్యంతరపెట్టడం లేదు. వారిని నిలిపితే నిధులు రావనీ, నిధులు లేకుంటే తమ ఉద్యోగాలు ఉండవనీ ఆ సంస్థల గేటు దగ్గరుండే వాచ్ మన్ కి కూడా తెలుసు. అందుకే అతడు సంస్థడైరెక్టర్ కి సలాం కొట్టకపోయినా మన్ శాంటో చిన్న ఉద్యోగికి మాత్రం దండం పెడతాడు.
జిఎమ్ విత్తనాలు, ఫుడ్స్ కి సంబంధించిన వాటిని మార్కెట్ లోకి అనుమతించే విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు మనదేశం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ, జెనిటిక్ ఇంజనీరింగ్ అఫ్రూవల్ కమిటి (జిఇఎసి) లో నియమించబడిన శాస్త్రవేత్తలంతా ఒకప్పుడు మన్ శాంటోతో సంబంధాలు కలిగినవారే. ఆ కమిటీలో సుప్రీమ్ కోర్టు నియమించిన ప్రతినిధి డా.పుష్ప భార్గవ. ఒకనాటి సమావేశంలో జిఎమ్ విత్తనాల తయారీ సంస్థ ప్రతినిధులను డా.భార్గవ పలురకాల ప్రశ్నలు వేశాడు. జిఎమ్ విత్తనాల లాభం గురించి ప్రశ్నలు అవి. అటువంటి ప్రశ్నలు వేయవద్దని, అలావేస్తే జిఎమ్ ఫుడ్ సంస్థలకు కోపం వస్తుందని ఇజిఎసి సభ్యులు డా.భార్గవని వారించారట. అంతేగాక డా.భార్గవని కమిటీలో నుండి తొలగించే యత్నాలు చేశారు.
డా.పుష్పభార్గవ లాంటివారు జాతి ప్రయోజనాలను కాపాడలని ప్రయత్నిస్తుంటే జిఇఎసి సభ్యులు మన్ శాంటో ప్రయోజనాలను కాపాడాలని చూస్తున్నారు. జిఇఎసి ఒకరకంగా మన్ శాంటో ఉత్పత్తులను దేశంలోకి అనుమతించే రబ్బరుస్టాంప్ అయింది. ఇప్పటికే మార్కెట్ లోకి జిఇఎసి అనుమతితో వచ్చిన బిటి కాటన్ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు. మనదేశంలో సెంట్రల్ కాటన్ రీసర్చి ఇనిస్టిట్యూట్ (సిసిఆర్ఐ) నాగపూర్ లో ఉంది. ఆ సంస్థ హైబ్రిడ్ కాని బిటి విత్తనాలు తయారుచేసింది. హైబ్రిడ్ బిటి కాటన్ పంటనిస్తుంది కాని విత్తనాలు ఇవ్వదు. ప్రతి ఏటా రైతు విత్తనాలు కొనుక్కోవల్సిందే. కాని నాగపూర్ బిటి కాటన్ విత్తనాలు ఇస్తుంది. ఆ విత్తనాలు దాచుకుని రైతు వాడుకోవచ్చు. తాము తయారుచేసిన బిటి కాటన్ విత్తనాలకు మార్కెటింగ్ పంపేందుకు అనుమతి కోసం సిసిఆర్ఐ దరఖాస్తు చేసుకుంది. కాని నేటివరకు జిఇఎసి అనుమతి నివ్వలేదు. ఈ లోగా రైతులు హైబ్రిడ్ కాటన్ విత్తనాలు అధిక ధరలకు కొంటున్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యవసాయరంగానికి జరుగుతున్న అన్యాయం.
నాగపూర్ సంస్థ విత్తనాలకు ఎందుకు అనుమతినివ్వడం లేదని డా.భార్గవ అడిగితే మన్ శాంటో కి వ్యతిరేకంగా ఏ పనీ చేయలేమని జిఇఎసి తేల్చి చెప్పింది. ఈ విషయం ఆయన బయటికి చెప్పారు. అయినా అధికార పార్టీలో స్పందన లేదు. మొన్నటి ఎన్నికల్లో జిఎమ్ ఫుడ్స్ విషయంలో బహుళజాతి సంస్థలను వ్యతిరేకించని ఏకైక రాజకీయపార్టీ కాంగ్రెస్. అది నేడు అధికారంలోకి వచ్చింది. ఇక జిఎమ్ విత్తనాల కంపెనీలదే రాజ్యం. ఇప్పటికైనా రైతులు కళ్ళు తెరవాలి. వ్యవసాయరంగానికి జరుగుతున్న అన్యాయం ఎటువంటిదో అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర్యాన్ని రక్షించుకొనే దిశగా ఇది ప్రధానమైన విషయం.
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|