|
|
Articles: TP Features | వలసవాద ఆలోచనకు ఆవల - Site Administrator
| |
నిజానికి ప్రాకృతం ప్రజల వ్యవహార భాష. అందుకే జైన, బౌద్ధ సాహిత్యమంతా ప్రాకృతంలోనే ఉంది. తెలుగు రాజులైన శాతవాహనులు ప్రాకృతంలో ఎన్నో రచనలు చేశారు. వివిధ కవులు రచించిన గాధలను సేకరించి 'గాధాసప్తశతి'గా కూర్చారు. అందుకే మహేశ్వర సూరి అనే పండితుడు 'శబ్దభేద ప్రకాశిక' గ్రంథంలో - సంస్కృత కావ్యపు అర్థం తెలియని మందబుద్ధులకు సులభంగా అర్ధం కావడం కోసం ప్రాకృతంలో రాస్తున్నానని అన్నాడు. గూడార్థం లేని దేశీ పదాలతో లలితాలైన వర్ణాలతో రాసిన అందమైన ప్రాకృత కావ్యం ఎవరికి ఆనందం కలిగించదు? పరోపకారుడైన కవి పిల్లలు, తల్లులు మొదలైన వారందరికీ తెలిసేటందుకై ప్రాకృతంలోనే గ్రంథ రచన చేయాలని ప్రకటించాడు.
ఇదే భావనతో ఆనాటి జైనాచార్యులు చాలా మంది ప్రాకృతంలోనే రాశారు. ఎన్నో గ్రంథాలు రాసిన హరిభద్రసూరి, వర్ధమాన, శీలాంక, జనపతి, సూరి మొదలైన జైనాచార్యులు, మల్లవాది, శాంతిరక్షిత, కమలశీల, శీలరక్షిత వంటి బౌద్ధాచార్యులు ఎక్కువపాళ్ళు ప్రాకృతంలో, తక్కువ పాళ్ళు సంస్కృతంలో రాశారు.
సంస్కృత, ప్రాకృత భాషల్లో దిట్ట అయిన దండి పండితుడు ప్రాకృత 'సేతుబంధం' గ్రంథాన్ని ప్రశంసించాడు. అందులో 'ఓహో! ఏమి ప్రాకృతభాష, ప్రియురాలి ముఖచంద్రబింబం వలె ఎంత మనోహరం. ప్రాకృత పదాలు అమృతం స్రవించడంలో నిర్భరాలు!' అన్నాడు.
అలాగే భోజరాజు కూడా ప్రాకృతాన్ని ప్రశంసించాడు. ఆఢ్యరాజుగారి రాజ్యంలో ప్రాకృతం మాట్లాడలేని అరసికులు ఉన్నారా అని ప్రశ్నించాడు. అయితే రానురాను ప్రాకృతాన్ని సంస్కృత పండితులు - వ్యవహార తెలుగుభాషని గ్రాంథికభాషా వాదులు - నిరాకరించినట్లే అపభ్రంశమని, గ్రామ్యమనీ అన్నారు. నిజానికి చాలాకాలం వరకు తాము ప్రాకృతంలో రాస్తామని, ఆ భాషే ప్రజలకు అర్థమవుతుందనీ, అందులోనే కవిత్వం సజీవంగా ఉట్టిపడుతుందని హాలుని వంటి రాజకవులు భావించారు. వారు ప్రాకృతాన్ని అపభ్రంశం అని అనలేదు. ఆచార్య దండి అంతటి వాడి చేత గౌరవం పొందిన ప్రవరసేనుడు ప్రాకృత ద్వేషం అర్థరహితమన్నాడు. ప్రాకృతపు తియ్యదనాన్ని ప్రాకృతంలో రచించిన 'వజ్జాలగ్గ' అనే కావ్యాలంకార గ్రంథంలో ప్రశంసించాడు.
ప్రాకృతం ప్రామాణిక భాషగా లేదని కొందరు వాదిస్తారు. కాని అది తప్పు, హేమచంద్రుడు తాను రాసిన 'దేశీ నామమాల'లో నాలుగు వేల దేశీ పదాలకు అర్థాలూ, ప్రమాణాలూ ఉదహరించాడు. వీరే కాకుండా అభిమాన చిహ్నుడు, భట్టి గోపాలుడు, పాదలిపాచార్యులు, క్రమదీశ్వరుడు, రాహులకుడు, సాంబుడు, శీలాకుడు మొదలైనవారు ప్రాకృత దేశీ కోశాలను రాసినట్లు తెలుస్తున్నది. ధనపాలుని ప్రాకృత లక్ష్యనామమాల లభించింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|