|
|
Articles: TP Features | పాపం! ప్రజారాజ్యం - Site Administrator
| |
కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు ఉండాలన్నది పెద్దల మాట. కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధపడటం ద్వారా తనను తాను చాలా ఎక్కువగానైనా ప్రజారాజ్యం భావించి ఉండాలి లేదా తనను తాను తక్కువ చేసుకునైనా ఉండాలన్నది పరిశీలకుల అభిప్రాయం. కాంగ్రెస్ తో కలిసే ముందు ఆ పార్టీలో బలమైన శక్తులు, వ్యక్తులు తమ పట్ల ఎలా వ్యవహరిస్తారన్నది ప్రజారాజ్యం నాయకులు అంచనా వేసుకుని ఉండాలి. కానీ అలాంటిది జరిగిందా అన్నది ప్రస్తుత సందేహం. ఇటు తెలుగుదేశం నుంచి, అటు కాంగ్రెస్ నేతల నుంచి జరిగిన దాడికి ప్రజారాజ్యం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. పొత్తు ఎందుకు? ప్రజారాజ్యం పనైపోయింది. అరవింద్ ఎందుకు మధ్యవర్తిత్వం నడిపినట్లు? కాంగ్రెస్ కు ప్రజారాజ్యం అనుకూలం. పొత్తు కంటే విలీనం మంచిది. గ్రేటర్ పరిధిలో కనీసం డివిజన్ కమిటీలు కూడా ప్రజారాజ్యానికి లేవు. ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు. ఇంకేవో ప్రయోజనాల కోసమే ఈ పొత్తు... ఇలా ప్రశ్నలు... వ్యాఖ్యలు.. ఆరోపణలు. వీటికి హేతుబద్ధంగా అంటే ప్రజారాజ్యం పార్టీని ప్రాణపదంగా ప్రేమించే వారిని సైతం సంతృప్తి పరిచే సమాధానాలు నాయకులు దగ్గర ఉన్నాయా అన్నది సందేహమే.
కాంగ్రెస్ లో జగన్ లాంటి నాయకుడినే అధిష్టానం చారులో కరివేపాకులా తీసి పక్కన పెట్టింది. అధిక సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతో మంది నాయకులు చేసిన డిమాండ్ నే బేఖాతరు చేయగలిగింది. అలాంటి కాంగ్రెస్ అధినాయకత్వం ప్రజారాజ్యానికి ఎలాంటి స్థానం ఇస్తుందో ఊహించలేకపోవడం ప్రజారాజ్యంలోని నాయకుల అవగాహన రాహిత్యానికి పరాకాష్ట. చేసుకుంటుంది కేవలం హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పొత్తు అయితే ఈ పొత్తు ద్వారా పార్టీని పటిష్టం చేసేసి చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం తమ లక్ష్యం అని చెప్పుకోవడమే వింతల్లోకెల్లా వింత అన్నది నిర్వివాదాంశం. గ్రేటర్ పొత్తు విషాదాంత కథలో కాంగ్రెస్ కు వచ్చిన నష్టం వీసమెత్తు లేదు. కానీ ప్రజారాజ్యం పొగొట్టుకున్నది మాత్రం చాలా ఎక్కువే. మరి నైతికంగా కోలుకోలేని దెబ్బతిన్నదని, ఇంతకాలం మిగిలిన ప్రజల విశ్వాసాన్ని కూడా ప్రజారాజ్యం ఇప్పుడు పూర్తిగా కోల్పోయిందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|