|
|
Articles: Short Stories | పోరాటం - Editor
| |
నువ్వు ఊళ్ళో వుండటం లేదు కదరా! నీకిక్కడి విషయాలేం తెలియవులేరా! ఈ ఊరు అదివరకటి ఊరు కాదురా! మనూరే కాదు! మన చుట్టుపక్కల ఊళ్ళన్నిటినీ ప్రస్తుతం 'సెజ్'లనే మాయామబ్బు కమ్మేసిందిరా! ఈ మబ్బు మన ఊళ్ళనీ, మన మనుషుల్నీ కూడా చుట్టుముట్టి దిగ్బంధనం చేసి ఊపిరాడకుండా చేస్తోంది. ఇప్పుడు మనకెదురైన ప్రెసిడెంటుగారి బామ్మరిది మన ఊళ్ళలో పొలాలమ్మించే ఏజెంటు. ఆవేదనగా చెప్పాడు బాలకోటి.
అదేమిటి కోటి? నేను రోజూ పేపర్లో చదువుతున్నాను కదా! మన ఊరు సెజ్ పరిధిలో లేదనీ, ఇక్కడి రైతులే డబ్బుకాశపడి భూములను అమ్ముకుంటున్నారని ప్రభుత్వమే ప్రకచించింది కదా! మరి మనం భూములు అమ్మాల్సిన పనిలేదు కదా? అన్నాడు శివ.
శివ బాబూ! ఆడేదో కూసోని గవర్మెంటోళ్ళు సెప్పింది పేపర్లో సదవడం కాదు, ఈడకొచ్చి సూస్తే తెలుస్తాది నిజమేంటో! మా లాంటివాళ్లకు గవర్నమెంటోళ్ళు ఇచ్చిన భూములు అసైన్డు భూములంటారుగదా ఆటిని, అయ్యన్నీ ఎప్పుడంటే అప్పుడు తిరిగి లాగేసుకోవచ్చంట గదా! అందుకే గవర్నమెంటు ఇచ్చిన డబ్బు ఎంతో కొంత తీసుకొని భూములొదిలి పోండి లేకపోతే అది కూడా రాదు అని మండలాఫీసు వాళ్ళు సెవినిల్లు గట్టుకొని పోర్తన్నారు కదా! ముసలితనం మీదపడ్డ ఈ వయస్సులో ఆ కూసింత నేల లాగేసుకుంటే బిడ్డా పాపల్తో మేమేడ నిలబడాల? మా కాళ్ళు ఏ పట్నాల మురికిసందుగొందుల్లోకి నడవాల? ఆవేశంతో వణుకుతున్న సిమ్మాద్రిని ఆపింది సత్తెమ్మ.
సాల్లేవయ్యా ఆపింక! కాసేపు నిమ్మళంగ ఉండు అంటూ వైరుబుట్టలో నున్న మంచినీళ్లు సీసా తీసి సింహాద్రితో తాగించింది.
అయినా బాబూ! మేం సదువుసంధ్యాలేనోళ్ళం! నువ్వు పెద్దసదువులు సదువుతున్నావు గదా! మరి ఈ న్యాయం నువ్వేడైనా సూశావేమో చెప్పు! ఏనాడో రాళ్ళూ రప్పలతో ముళ్ళసెట్లతో, ఇసకదిబ్బల్తో ఉన్న బంజరు భూమిని మాలాంటి బీదాబిక్కికి గవర్నమెంటు పాతికసెంట్లో, ముప్పైసెంట్లో ఇస్తే మా చారెడు గింజలు మేమే పండించుకోవాలని ఎంత తాపత్రయ పడినామో కదా! రాళ్ళూ, రప్పలు తీసేసి, ముళ్ళ చెట్లన్నిటినీ నరికి, ఇక దిబ్బల్ని కరిగెయ్యడానికి మా ఒంట్లో సత్తువని కరగేసి బంజరు భూముల్ని పంటసేలుగా మార్చినాం కదా! మొదట్లో పంటనీటి కాల్వలేడవి? బుంగలతో నీటిని ఏతామేసి పారించి జబ్బల సత్తువంతా నేలలో ఇంకించినాం కదా! ఇదంతా సేసి ఈయాల మా బూముల్నుండి మమ్మల్ని ఎల్ళగొడతారా? ఎందుకెళ్ళాల మేం? ఎవరికోసం? ఎవుడో, ఏ దేశపోడో ఆడికున్న డబ్బు కట్టల్ని తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు కడతానికా? వాటిల్లో మనకి ఒకటో రెండో బంట్రోతు ఉద్యోగాలిస్తానికా? అయినా శివబాబూ! ఆ దేశాల్నుండి ఇక్కడికి వచ్చే వాడెవడైనా తన లాభం చూసుకుంటాడా? మన జనంకోసం కోట్లు ఖర్చుపెడతాడా? మరి ఆ లాభాల్ని ఆడి దేశమెత్తుకుపోతాడని, మన దేశాన్ని ఒట్టిపోయిన గొడ్డును చేస్తాడని మనోళ్ళకు తెలీదా? మా అవ్వ సెప్పేది జనం తిండి గింజల్ని పండిస్తే తెల్లోడు జనం మీద పడి సావగొట్టి శిస్తులు వసూల్చేసి జనాన్ని పీడించేవాడని. మళ్ళీ మనకా రోజులు రాబోతున్నాయి. ఈ కళ్ళతో ఇంకేం సూడాల్సి ఉందో! నిర్వేదంగా నిట్టూర్చింది సత్తెమ్మ.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|