|
|
Articles: My Thoughts | శాంతిని హరించే టెర్రర్ - Mr. Narasimham Uppala
| |
గతంలో ముంబాయిలో వరుస బాంబు పేలుళ్లు జరిగినప్పుడు గాని, ఇప్పుడు గాని ముంబాయి ప్రజలే విజేతలు అయ్యారు గాని ఉగ్రవాదులు కాదు. ఆ మరుసటి రోజు నుంచే ప్రజలు యధావిధిగా తమ విధులను నిర్వహించడం ప్రారంభించారు. వారి ధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీసిన సూచనలు ఎక్కడా కనిపించలేదు. ఉగ్రవాదంపై మరింత ద్వేషం, కసి పెరిగిందే తప్ప మరొకటి కాదు.
అమెరికాలో 9/11 తరువాత ఉగ్రవాదం ముందు ప్రపంచం మోకరిల్లుతుందని అఫ్ఘన్ గిరిజన ప్రాంతాల్లో దాక్కున్న కొందరు ఊహిస్తే ఊహించి ఉండవచ్చు. అలాంటిదేమీ జరగలేదు. జరగదు.
ఇప్పుడు 2/11 దాడితో భారతదేశం ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందని భ్రమించినవాళ్లు ఉండవచ్చు. కాని అలాంటి పరిస్థితి తలెత్తదని భారతదేశం నిరూపించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని సైతం తట్టుకుని శక్తివంతంగా నిలిచిన దేశాలలో భారతదేశం ఒకటి. అలాంటి ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చాలనుకోవడం సూర్యుడి పై ఉమ్మివేయడం లాంటిదే!
ఏ మతం, ఏ పౌర సమాజం అంగీకరించని భావనలను నరనరాన జీర్ణించుకుని, తప్పుడు సమాచారంతో ప్రభావితులై, తప్పుడు వాగ్దానాలకు తలొగ్గి, తప్పుడు పనులకు పాల్పడే ఉగ్రవాదులకు కొన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వాల సైనిక సంస్థలు అండగా నిలవడం విషాదకరం.
అనాగరిక భావజాలంతో, తమ చెప్పుచేతల్లోనే ప్రపంచం ఉండాలని లేకపోతే మానవ బాంబులను పేల్చుతాం... ఆర్.డి.ఎక్స్ ను పేల్చుతాం... ముంబయ్ పై చేసిన 'యుద్ధం' లాంటి యుద్ధాలు చేస్తాం అంటే అది ఏ మేరకు ఆమోదయోగ్యం?
జమ్మూ-కాశ్మీర్ లో రావణకాష్టంలా కాలుతున్న ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ.ప్రేరణ ఉందని ప్రపంచంమంతా గుర్తించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదుల క్యాంపులున్నాయని శాటిలైట్ల ద్వారా తెలిసిపోతూనే ఉంది. సరిహద్దు వద్ద చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. చొరబాట్లు తేలిక కావడానికి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పూనుకుంటూనే ఉంది. ఇదంతా బహిరంగ రహస్యం.
అటు కాశ్మీర్, ఇటు ముంబయ్ గాక రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోనూ ముష్కరులు పాగావేశారు. స్కూటర్ బాంబుల పేల్చివేతకు పథకం జరిగిందని వార్తలొచ్చాయి. అంతేగాక ఐ.ఎస్.ఐ. ప్రోద్బలంతో అనేకమంది యుకులకు శిక్షణ కొనసాగుతోందని, రంగారెడ్డి జిల్లా అడవుల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేశారని, నగరం నడిబొడ్డున విషప్రచారంతో యువతను ఆకర్షించి ఉగ్రవాదరసం అందిస్తున్నారని... ఇలా ఒకటేమిటి అటు కేరళ మొదలు ఇటు కళింగ వరకు అన్నీ టెర్రరిస్టు జాడలే!...
సమాజ అల్లికను మరింత చిక్కగా బలోపేతంగా రూపొందించే క్రమంలో పాల్గొనడంలో, దాన్ని ఆస్వాదించడంలో ఆనందముంది. వినాశకర విధ్వంసకాండలో శోకం మాత్రమే ఉంది. శోకాన్ని ఎవరు కోరుకుంటారు?...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|