|
|
Articles: My Thoughts | షడంగాల నెలవు - Site Administrator
| |
శాస్త్రిగారి గురువులు పరమ శ్రోతీయులు. వీరూ, సంప్రదాయము మేరకు మడిగా, బాసెనపట్టుగా చదువులు నేర్చినారు. ఆ చదివిన అంతో ఇంతో, ఎంతగానో సద్వివినియోగము చేయగలిగినారు.
ఒజ్జల కరుణను, వయసు వచ్చీరాని, తనాన, పైన సేలువతో ఊరూరా అవధానములు చేసి, ఔననిపించుకొని, పెద్దలు మెచ్చి ఇచ్చిన పతకములు ధరించి, నిబ్బరముగా రొమ్ము విరుచుకుని, కైతల అల్లికలో, అపారమైన అనుభవము, యింగితము అలవరచుకున్నారు. కాని పద్దెములు కట్టుటకే కట్టుబడి ఉండలేకపోయినారు. వచన రచన ఆయన సొమ్మైనది. ఆ వనమే, మనకు కలకాలము పెన్నిది అయినది.
'ఏమండీ! మీరు, ముమ్మూర్తులా భారతము ఆరగా ఆరగా చదువుకొంటిరే - ప్రబంధముల సాముగారడీల దేలితిరే - చిన్నయ సూరి వచనము, కల్వాన నూరితిరే - ఆ పడిన పాటులన్నీ మూలకు నెట్టి తేటతెలుగులో సూటిగా మాటలు చెప్పినట్లు కాగితం మీద పెట్టడం, అవ్వ పసిపాపను లాలించి, గోరుగోరు ముద్దగా బువ్వ తినిపించినట్లు, కథలు వినిపించడం - ఇది మీకు ఎలా అబ్బిందండీ?' అని అడిగితే, ఆయన అన్నారు కదా -
'... దానికి ఎంత కాండ ఉందునుకున్నావ్! అది, అట్టే అబ్బింది కాదు. ఉన్నట్టుండి మొలుచుకువచ్చింది కాదు. సాధనచేయగా చేయగా అందుబటైంది కాదు అదో కథ!'
అసలు కమామిషేమింటే - నేను వస్తుత: పద్దెగాణ్ణి కాను! మనుపు పద్యం కట్టడమంటే ప్రాణం! చక్కని కవిత్వం, చక్కని గొంతున వినడం పంచభక్ష్యపరమాన్న భోజనం! కాని వీటిల్లూ బంగారంగానూ, పద్యాలకు ఏదో గ్రహణం మొరక ఉంది. దానాదీనా, తాపసము పెరిగేను, దర్పం పెరిగేను. గండ్రతనం కన్ను గప్పేను. తన కన్న ఘనుడు వేరొకడున్నాడా అనే పనికిమాలిన ధీమా బలీయం. కవులది సిగపట్లగోత్రమయ్యా! వ్యాసుడూ, భాసుడూ హయాములో ఏమోగాని - ఇప్పుడు మట్టుకు - నిప్పచ్చరమే.
నావి గట్టుమీద కూర్చుని అజమాయిషీ చేసే కామందు ధర్మపన్నాలు కావు! అడుసులో దిగాను... తెలివి తెచ్చుకుని, కాళ్ళు కడుక్కున్నాను! నాకు బుద్ధి తెలిసేటప్పటికి యిటు మా గురువులు, అటు తిరుపతి వేంకటేశ్వరులు, మరో అటు కొప్పరపు గనీశ్వరులు! వీరందరూ సజ్జనులే, వస్తు: మాంచి గృహస్థులే. ఒకరికి చెప్పదగినవారు కాని, చెప్పించుకోవలసిన వారు కారే! కాని, కందగీత మత్తేభములై, జడివానగా, సంద్రపు హోరుగా, ఏళ్ళకు ఏళ్ళు, పరిపరివిధాల తాతామనవళ్ల వరసల పరవళ్ళు పోలేదా! దిల్! ఎందుకా పనికిమాలిన రభస! యిందువల్ల ఒరిగినదేమున్నది!
కాని, నాకీ యింగితం ఆదికాలంనుండే ఉందనా? ఊహూ-నేనూ నాలుగు అన్నాను, పది పడ్డాను. అంతటితో బుద్ధి తెచ్చుకుని, ఆ ప్రాబంధిక బడుద్ధాయితనానికి, యిన్ని నీళ్ళు వదిలిపెట్టాను.
అయితే గియితే, ఆ అనుభవమూ ఒకందుకు మంచిదే అయింది. ఆనాటి నుంచీ నేను నొవ్వను, తెలిసి తెలిసి యింకొకరిని నొప్పించను. అప్పటికీ ఇప్పటికీ నేనంతే! - నాకథలూ అంతే. ఇదంతా పూర్వరంగం అనుకో! ప్రస్తుతాన్ని అనుసరిద్దాం - యీ వచనం నీకెలా అబ్బిందయ్యా అంటావా! ఉగ్గుపాలనాడే అబ్బింది
పదుగురాడు మాటలు విని, మనం పలుక నేర్చాము. నలుగురిలో కలిసి మెలిసి మెలగనేర్చాము. మనము పుస్తకాలమూ, పాఠ్య గ్రంథాలమూ కాదు. మన ప్రయోగానికి అర్థమూ, స్వారస్వమూ మనము విప్పి చెపితేనే కాని, ఎదుటివాడికి అర్థం కాదనే అనర్థం సృష్టిలో లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|