|
|
Articles: Short Stories | పండుగ - Site Administrator
| |
ఇంకొక పండగకి కొడుకు కుటుంబం వచ్చింది. పోనీలే నాయనా. ఈ పండక్కయినా వచ్చారు అంటూ కొడుకుని మెచ్చుకుంది కమలమ్మ.
ప్రతి పండక్కీ రావడం ఎట్లాగమ్మా అన్నాడు కొడుకు వస్తూనే.
తల్లి మనసు చివుక్కుమంది.
అదేమిట్రా అట్లా అంటావు. మేమున్నంతవరకే కదా ఈ రాకపోకలూ అంటూ కొడుక్కి సర్ది చెప్పింది.
మనవడు, మనవరాలు వచ్చినా ఆవిడ దగ్గరకు రావడం లేదు. ఉన్నన్ని రోజులూ టి.వి.చూస్తూ గడుపుతున్నారు. ఏం చదువుతున్నార్రా అన్న తన ప్రశ్నకు కూడా వాళ్ల దగ్గర నుండి సమాధానం రాలేదు. అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.
కోడల్లో కూడా మార్పు వచ్చింది. ఇది వరకు అయితే తనను ఏ పనీ చేయనివ్వకుండా ఉన్నన్ని రోజులూ కలివిడిగా తిరుగుతూ అన్ని పనులూ కల్పించుకుని చేసేది. కానీ ఇప్పుడు తను కూడా పిల్లలతో పాటు టీ.వీ చూడ్డం, వాళ్ళతో కాలక్షేపం చేయడంతోనే సరిపోయింది.
కోడలు తీరు చూసిన కమలమ్మకు అసహనం ఎక్కువయింది. ఫలహారాలు, భోజనాలు కూడా వాళ్ళున్న చోటికే తీసుకెళ్ళి అందించాల్సిన పరిస్థితి వచ్చింది. సహజంగానే ఆవిడకు చిరాకు అనిపించింది. ఇవన్నీ చూస్తున్న కొడుకు భార్యని మందలించే ప్రయత్నం చేయకపోడవం ఆవిడను నిస్పృహకు గురి చేసింది.
'ఉత్త వాజమ్మ' అంటూ కొడుక్కి బిరుదిచ్చేసింది... అక్కసుగా.
మళ్ళీ పండగ రోజులు దగ్గర పడ్డాయి.
ఈ సారి పండక్కి పిల్లుద్దామా అన్నాడు కాంతయ్య భార్యతో.
కమలమ్మ నుంచి సమాధానం రాలేదు.
ఏమయింది? ప్రతిసారీ పండక్కి పిల్లలను పిలవమని నువ్వే తొందర చేస్తావు కదా...? అన్నాడాయన.
ప్రతి పండక్కీ రావడానికి వాళ్ళకు కుదరద్దూ అన్నదావిడ భర్తకు సర్థి చెపుతూ.
అవునన్నట్లుగా ఆయన ఊరుకున్నాడు.
కానీ...
కమలమ్మకు తను పండగ రోజుల్లో పడే శ్రమ గుర్తుకొచ్చింది.
ఇదివరకు రోజుల్లో అందరూ కలిస్తే పండగ. కానీ ఇప్పుడు ఎవరూ రాకుండా ఉంటేనే పండగ అనుకుంది.
అయితే ఈ మాటలు ఎవరితోనూ అనదు. 'ఎంతయినా తల్లి కదా '
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|