|
|
Articles: My Thoughts | చరిత్ర విజ్ఞాన శాస్త్రమా? - Site Administrator
| |
చరిత్ర అంటే గతాన్ని గురించే కదా అనుకోవచ్చు, కాని సామాజిక శాస్త్ర దృక్పథంతో పరిశీలిస్తే ఉన్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఏమవుతుందో ఊహించబుద్ధి అవుతుంది. ప్రపంచపు షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టదలచుకున్నవారు ఏ దేశం పరిస్థితి ఎలా మారబోతోందో వీలున్నంత కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక, వ్యవసాయక, పారిశ్రామిక అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఒక్కొక్కప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాలు అనుకున్నట్టుగా రాకపోవడం, అధికారంలోకి వచ్చిన వ్యక్తి అనూహ్యమైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపడం జరుగుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ముందు జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధ కాలంలో ఇందిరాగాంధీ రాజకీయ వైఖరీ, ఆ తరువాత ఆమె హత్యా చరిత్రని ఎలా మార్చాయో మనకు తెలిసిందే. మరొక వంక పశ్చిమదేశాల ఉద్యోగాలు కొన్ని మనదేశానికీ, ఇతర ప్రాచ్యదేశాలకూ రెక్కలుకట్టుకు వెళుతున్న ధోరణిని బట్టి ఎటువంటి మార్పులు కలుగుతాయో కొంతవరకూ చెప్పవచ్చు.
ప్రాచీన అవశేషాలను గురించిన పరిశోధనల్లో శాస్త్రవిజ్ఞానం అనేకరకాలుగా పనికొస్తుంది. ఉదారహణకు హిమయుగాలలో కలిగిన మార్పులు భూమిమీది ప్రాణులనూ తొలి మానవులనూ అనేక ప్రభావాలకు గురిచేశాయని పరిశోధన వల్ల తెలిసింది. గత హిమయుగం పదివేల ఏళ్ల క్రితం ముగిసినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో సముద్రజలాలన్నీ ధ్రువాల్లో మంచుగా పేరుకోవడం వల్ల సముద్రమట్టాలన్నీ పడిపోయాయి. యూరప్ ఉత్తర ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడటంతో మనుషుల, జంతువుల సంచారం సులువుగా జరిగి ఉంటుంది. ఈ వలసల వల్ల అనేక ప్రాంతాలు మనుషులకూ జంతువులకూ కూడా నివాసయోగ్యం అయ్యాయి. ఆ తరువాత మంచు కరిగి, మధ్యనున్న ప్రాంతాలు జలమయం కావడంతో కొన్ని సందర్భాల్లో తిరుగు ప్రయాణాలు వీలువలేదు. ఇటువంటి సంఘటనలన్నీ తరువాత చరిత్రను కొంత వరకు మార్చగలిగాయి.
సముద్రాలు అడుగంటటంతో ఈనాడు ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న న్యూగినీ ద్వీపాలూ, దక్షిణాన ఉన్న టాజ్మేనియా అన్నీ ఒకే విస్తృత భూఖండంగా ఉండేవి. ఇప్పటిలాగా మధ్యలో సముద్రాలుండేవి కావు. అటు తూర్పు ఆసియాలో వియత్నాం, చైనా తూర్పు తీరప్రాంతాలూ, బోర్నియో అన్నీ ఒకే విస్తృత భూఖండంగా ఉండేవి. విస్తృత ఆసియా తూర్పుకొసకూ విస్తృత ఆస్ట్రేలియా పడమటి ప్రాంతాలకూ మధ్య సముద్రం చిన్నదిగా ఉండేది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|