|
|
Articles: Time Pass | చీకటి టూ చీకటి! - Site Administrator
| |
పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే గిరిజనులు - తాము చాలాకాలంగా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలివ్వలేదని - పట్టాలిచ్చి - ఆ భూమికి భూమి ఇవ్వవలసిందిగా అడుగుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోదు. గిరిజనులు తీవ్రవాదులతో చేరి డామ్ ను డైనమెట్లతో బద్దలు చేస్తారు. సాగులో ఉన్నప్పటికీ పట్టాలు లేకపోవడం వాస్తవమేనని - ఊహాజనితమైనది కాదని నా అభిప్రాయం తెలిపాను. దాన్ని అంగీకరిస్తూ డామ్ బద్దలుకొట్టడం ఉగ్రవాద చర్య కాబట్టి - దాన్ని గ్రాఫిక్స్ లో చూపించుకోవలసిందిగా సూచిస్తూ సెన్సార్ బోర్డు `అడవిబిడ్డలు' సినిమాను ప్రదర్శనకు అనుమతించింది. `శ్రీ ఆంజనేయం' సినిమాలో పోలవరం జమీందారు తన నాలుగువేల ఎకరాలను పంచిపెట్టి నిర్వాసితులను శాంతింపచేసినట్లు ఒక అద్భుతమైన ముగింపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా సూరపాలెం రిజర్వాయర్ కింద నిర్వాసితులయ్యే గిరిజన కుటుంబాలు 167 అని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అధికారులు లెక్కతేల్చారు. 57 ఇళ్లున్న `చోడివీధి' గిరిజనులు తమను నిర్వాసితులలో లెక్కించలేదని మొత్తుకుంటున్నారు. ప్రభుత్వం తరపున పునరావాస ప్రణాళిక తయారుచేసిన `సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్' (సెస్) 243 కుటుంబాలను నిర్వాసితులుగా లెక్కించింది కాని - వారి జాబితా ఇవ్వలేదు. ఈ అంచనాకు ఆధారమేమిటో కూడా ఈ నివేదిక చెప్పలేదు. ఈ నివేదికను జిల్లా అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ వారు పట్టించుకోలేదు. కాని `నర్మదా డాం' కేసులో నిర్వాసితులను నిర్వచిస్తూ రిజర్వాయర్ లో నీరు నిలువ చేసినందువల్ల రిజర్వాయిర్ పూర్తి నీటిమట్టం (ఫుల్ రిజర్వాయిర్ లెవల్) పైనున్న కొంత ప్రాంతం నీటి చెమ్మ వల్ల దెబ్బతింటుంది కాబట్టి ఆ ప్రాంతంలో జనాన్ని కూడా నిర్వాసితులుగా లెక్కిస్తూ పునరావాసం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సెస్ నివేదిక పేర్కోలేదు. ఈ తీర్పును అంగీకరించి చోడివీధిలో 57 కుటుంబాలకు జిల్లా అధికారులు పునరావాసం కల్పించారు. ప్రక్కనే భూపతిపాలెం రిజర్వాయిర్ కింద ముందుగా లెక్కించిన భూసేకరణను మళ్ళీ లెక్కించి ముంపునుండి చినగెద్దాడ గ్రామం మినహాయించారు. సంవత్సరం పాటు నిర్మాణం ప్రారంభించకుండా గిరిజనులు అడ్డుకున్నారు. చివరకు భూపతిపాలెం కొత్తపాకాల గ్రామస్థులు పునరావాసానికి అంగీకరించి డామ్ నిర్మాణానికి చేతిపంపులు, ఇళ్ళకాలనీ ఆయకట్ట కింద 20 కి.మీ.దూరంలో ఇచ్చి సరిపెట్టారు. చివరిదాకా పోరాడిన గ్రామం గాంధీనగరానికి ఐదుసెంట్ల ఇళ్ళస్థలం, భూమికి భూమి, రిజర్వాయర్ లో చేపలు పట్టుకొనేందుకు వీలుగా పక్కనే ఇళ్ల కాలనీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కింద భూమికి భూమి సర్వే నెంబర్లతో ముందే చూపించవలసిందిగా సుప్రీంకోర్టు నియమించిన కేంద్రసాధికార కమిటీ ఆదేశించింది.
ప్రకాశం జిల్లాలో గల నల్లమల అడవులలోని మారుమూల గ్రామం పాలుట్లకు హెలీకాప్టర్ లో సిబ్బందిని తరలించి ఎన్నికలు నిర్వహించినట్లు మనం ప్రచార సాధనాలలో చూశాం. 2001 లో జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికలలో చెంచులను ఓటర్లుగా నమోదు చేయడానికి రెవిన్యూ బృందాలు కాలినడకన ఈ చెంచుగ్రామాలన్నీ ఐదు రోజులు తిరిగాయి. 2005లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ప్రకాశం జిల్లా 60-70 వేలమంది పేర్లు ఓటర్ల జాబితా నుండి గల్లంతయినందుకు పెద్ద గొడవ జరిగింది. ఈసారి ఎన్నికలలో గుర్తింపు కార్డు ఇచ్చినా కూడా ఓటర్ల జాబితాలో పేర్లు లేక 20-30 లక్షల మంది తమ వోటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
మన విద్యావేత్తలకు ప్రజలకు ఎటువంటి చదువు కావాలో తెలియదు. ఈ చదువును వంటబట్టించుకొన్న మన మాజీ అధికారులు మందీ మార్బలంతో ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజలలోకి పోవడం తప్ప - ప్రజలతో కలిసి ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజలకు శక్తియుక్తులు నేర్పి, వారికి అండగా నిలబడే చొరవ, పూనిక లేవు. ధనం, మద్యంమత్తులాగే, సినిమామత్తులో వోట్లు వేస్తారని విశ్వాసం కొందరికి. ఇక కళాకారులు కొందరు మధ్యయుగంలో పోరాట పద్ధతులను కీర్తిస్తుంటే, మరికొందరు అద్భుతమూ, అసంగతమైన మలుపులు తిప్పి శుభంకార్డులేస్తారు. వీరందరిని గంట గంటకు చూపించి ప్రచారసాధనాలు జనం బుర్ర తినేస్తున్నాయి. జనాన్ని చీకటి నుండి చీకట్లోకి నెడుతున్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|