|
|
Articles: TP Features | తల్లిని విస్మరిస్తే అంతే మరి! - Site Administrator
| |
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసమే ఏర్పడింది. నందమూరి తారక రామారావు తెలుగువారి వల్లనే గెలిచారు. తెలుగుదేశం అనే పేరును వాడుకునే ప్రస్తుత రాజకీయపక్షం తెలుగు అనే ఒక భాష ఉందని ఏనాడో మర్చిపోయింది. ఓటర్లకు `అవి ఇస్తాం ఇవి ఇస్తాం' అని వెయ్యి వాగ్దానాలు చేసిన ఈ నాయకులు తెలుగు భాషా సంస్కృతులకు ఫలానిది చేస్తామని ఒక్కమాట కూడా అనకపోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.
చిరంజీవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అభ్యుదయం సాధించడానికి కేవలం నిజాయితీ, నిష్ఠ, అభ్యుదయ భావాలు చాలవు. దానితో పాటు ప్రజల్ని ఆకర్షించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం పుష్కలంగా ఉన్న చిరంజీవి సామాజికన్యాయం, అవినీతి నిర్మూలనం అనే రెండు చాటింపులతో తమకు ఓట్లు పడతాయనుకున్నారు. ఏదైనా ఒక విషయాన్ని చెప్తే చాలదు, దాన్ని సాధించే విధానాన్ని కూడా ప్రకటించాలి. `మేము ఇది చేస్తాం అది చేస్తాం' అని చెప్పడం కాదు, ఎలా చేస్తామని స్పష్టం చేయాలి.
రామారావు గెలవడానికి ముఖ్య కారణం తెలుగువారిని, తెలుగు సంస్కృతిని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని చెప్పటమే. ఒక భాషాప్రదేశంలో అందరూ అదే భాషని మాట్లాడుతూ అదే సంస్కతిని అనుసరిస్తుంటే ఆ భాషలో పరిణితిని పొందినవారికి మేలు చేస్తామని ఒక్క మాట కూడా చెప్పని ఈ రాజకీయ నాయకుల్ని ఎందుకు గెలిపించాలి? చిరంజీవి తెలుగువారికి `క్వాలిటీ ఎడ్యుకేషన్' ఇస్తామన్నారు. అంటే ఇంగ్లీషులో చదువు చెప్పిస్తామని అర్థమా? చైనా రష్యా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండు, స్వీడన్, డెన్మార్కు, ఫ్రాన్సు - ఇంకా ఎన్నో దేశాలు వారివారి భాషల్లోనే చదువుకుంటూ చదువు చెప్తూ తమ బలాల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు!
పక్కన కర్నాటకలో ఉన్న ప్రభుత్వాన్ని చూచి కూడా మన వారు ఏమీ నేర్చుకోరు కదా. ఇప్పటి ప్రభుత్వానికి పార్లమెంటులో ఎక్కువ సీట్లు సంపాదించిపెట్టడంలో కన్నడం పాత్ర కూడా ఎంతో ఉంది. కర్నాటక రాష్ట్రంలో కన్నడ భాషను గురించి, కన్నడ సంస్కృతిని గురించి మాట్లాడని వారికి భవిష్యత్తు లేదు. కర్నాటక ప్రభుత్వం పూనుకొని ఉండకపోతే కన్నడానికి గాని, తెలుగుకు గాని ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని కల్పిస్తూ తమిళనాడు న్యాయస్థానంలో ఉండే వాజ్యం తేలితే కాని ప్రాచీన భాషా ప్రతిపత్తి అమలులోకి రాదని స్పష్టం చేసింది. కాని కర్నాటక ప్రభుత్వం `మీరివ్వకున్నా మేము చేసేది చేస్తాం' అని కర్నాటక రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో ఉండే కన్నడ శాఖలకు ప్రతిదానికీ రెండు కోట్లు చొప్పున మంజూరు చేసింది. తెలుగు సోదరులకు ఇలాంటివి విన్నా ఏ మాత్రం స్పందన కలగదు గాక కలగదు. ఇప్పటికే కర్నాటకలో అన్ని విశ్వవిద్యాలయాల కన్నడ శాఖలు క్లాసికల్ కన్నడ భాషకు సంబంధించిన అద్భుత ప్రణాళికల్ని మొదలుపెట్టాయి. ఇలా రెండు కోట్ల వంతున కన్నడ అధ్యయన శాఖలకు ఇవ్వటాన్ని ఇతర రాష్ట్రాలలో ఉన్న కన్నడ శాఖలకు కూడా విస్తరించే ఆలోచన కర్నాటక ప్రభుత్వానికుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|