ధర్మార్థ, కామ, మోక్షాలను పురుషార్థాలని వేదాలు నిర్వచించాయి. అంటే ఏన్నో వేల జన్మల అనంతరం లభించే ఈ అపురూపమైన మానవజన్మ ఎత్తిన ప్రతీవారు తప్పక సాధించవలసిన విషయాలివి అని అర్ధం. వీటిలో ఏ ఒక్కటి సాధించలేకపోయినా ఎత్తిన ఈ మానవ జన్మకు విలువ ఉండదు. ఈ పురుషార్థాల వరుస క్రమాన్ని పరిశీలిస్తే ధర్మం ప్రథమ స్థానంలో ఉంది. దీనిని బట్టి ధర్మాచరణ, ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను వేదాలు నొక్కి వక్కాణించాయి.
ఐహిక విషయ వాంఛలు, భోగ భాగ్యాలే కాక మైధునాల విషయాలను కూడా ధర్మయుతంగానే మనం సాధించుకోవాలి, అనుభవించాలి. మనం వేసే ప్రతీ అడుగు, చేసే ప్రతి ఆలోచనా కూడా ధర్మానుకూలంగానే ఉండాలి. ఇది సృష్టి నియమం. ఎంతటి మహా భక్తుడైనా వీటిని అధర్మంగా సాధించాలని యత్నిస్తే అధోగతి పాలు కాక తప్పదు. ఇందుకు మన పురాణాలలో లెక్కకు మించిన తార్కాణాలు ఉన్నాయి.
రాక్షస రాజైన హిరణ్య కశిపుడు దేవతలను లొంగదీసుకోవడానికి బ్రహ్మదేవుని గూర్చి అతి కఠోరమైన తపస్సు చేశాడు. మహర్షులకు సైతం సాధ్యం కాని రీతిలో తపస్సు ఒనరించాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆయన తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమని అడిగితే అజ్ఞానం, గర్వాహంకారాలతో తల్లి కడుపులో నుండి పుట్టక, రాత్రి, పగలు కాక, మనిషి, జంతువు కాక నేల మీద, ఆకాశంలో కాక మరణించకుండునట్లు వరం పొందాడు. ఇది ఎంతటి అధర్మ యుతం? సృష్టికి విరుద్ధం? స్వార్ధానికి పరాకాష్ట. వరం పొందాక మరణాన్ని జయించానన్న అహంకారంతో విర్రవీగి ఎన్నో వర్ణింపశక్యం కాని దుర్మార్గాలు చేశాడు. దేవతలను అనేక ఇక్కట్ల పాలు చేశాడు. ఎందరో పరస్త్రీలను అమానుషంగా అధర్మయుతంగా అనుభవించాడు. ఫలితంగా అతని పాపం పండే నాటికి శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనార్ధం నారసింహావతారం ఎత్తి హిరణ్య కశిపుని సంహరించాడు. హిరణ్య కశిపుని ఘోర తపస్సు అధర్మయుత కోరికలకు, నడవడికకు బలైపోయింది.
పరమశివ భక్తాగ్రేసరుడైన రావణబ్రహ్మ తన తల్లి కోరిక తీర్చడం కోసం కఠోర తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్నే కానుకగా పొందాడు. మహా భక్తుడినన్న అహంకారంతో శివ పార్వతుల నివాసమైన కైలాస పర్వతాన్ని పెకిలించి తన శిరస్సుపై మోసినవాడు. నిత్యం సప్త సముద్రాలను దాటి శివారాధన చేసి తిరిగి తన లంకాపురికి వచ్చేవరకు పచ్చి గంగైనా ముట్టని రావణబ్రహ్మ తన అద్భుతమైన, అసామాన్యమైన దీక్ష ద్వారా దేవతల చేత మరణం పొందకుండునట్లు వరం పొందాడు. కేవలం అహంకారం చేతనే మానవ, జంతువులను విస్మరించాడు.
అపూర్వమైన వరాలను పొందిన కారణంగా దేవతలపై దండెత్తి వారిని దారుణంగా హింసించాడు. ఎందరో పరస్త్రీలను చెరబట్టాడు. చివరకు శూర్పణఖ ప్రేరేపించిన కారణంగా మహా సాధ్వి, శ్రీ రామచంద్రుని పట్టమహిషి అయిన సీతమ్మ తల్లినే వంచనతో సాధువు రూపంలో వచ్చి అపహరించాడు. అధర్మయుతంగా ఇతరుల సంపదలను, స్త్రీలను అనుభవించిన కారణంగానే యుద్ధంలో తన వారినందరినీ పోగొట్టుకొని చివరకు శ్రీ రామచంద్రుని చేతిలో దిక్కు లేని చావు చచ్చాడు. ఎంతటి మహా భక్తుడు? ధర్మబద్ధం కాని నడవడిక వలన నాశనమైపోయాడు.
|