Active Blogs | Popular Blogs | Recent Blogs '' నానమ్మా... ! నువ్వు ఊరికి వెళ్ళిపోతున్నావా...... ! మళ్ళెప్పుడొస్తావ్...... ! "బయలుదేరుతున్న నానమ్మ వంక దిగులుగా చూస్తూ అడిగింది ఏడేళ్ళ మాధవి.
" త్వరగా వచ్చేస్తాగా..... "మనవలాలి బుగ్గ గిల్లి నవ్వుతూ చెప్పింది సావిత్రమ్మ.
" యెప్పుడూ అంతే ... ఇదిగో వస్తానంటావు.... త్వరగా రావు.... ! "దిగులుగా ముఖం పెట్టింది మాధవి.
" నేనూ... నాన్న.. తమ్ముడూ వున్నాం గా దిగులెందుకు.... నానమ్మని విసిగించకు... " చెప్పింది జ్యోతి.
" ఎందుకూ... మీకు ఒక్క కధ కూడా రాదు. నానమ్మయితే బోల్డన్ని కధలు చెపుతుంది.... "తల్లి వంక ఈసడింపుగా చూస్తూ అంది మాధవి. ఆశ్చర్య పోవడం అందరి వంతయింది.
నిజమే.... ఈనాడు ఎంత మంది తల్లులు పిల్లలకు కధలు చెపుతున్నారు. అసలు కధలు కావాలని అడిగే పిల్లలు ఎక్కడ వున్నారు. వారికి కధల మాధుర్యం గురించి తెలిస్తే కదా... !చల్లని వెన్నెల్లో... తాతయ్యల, నానమ్మల, అమ్మమ్మల ఒడిలో పడుకొని కమ్మటి కధలు వినే భాగ్యం నేటి తరానికి ఎక్కడిది.?ఆదర్శ కుటుంబం... పరిమిత కుటుంబం పేరుతో పెద్దలను గాలికి వదిలేసి ఇరుకు గదుల్లో కాపురాలు పెట్టిన నవ నాగరిక జీవితాలకి చల్లని వెన్నెల, అందమైన ప్రకృతి... ఆహ్లాదకరమైన వాతావరణం తో పాటు.... మంచి కధలను వినే భాగ్యం కూడా కోల్పోయారు.
పరుగులు తీసే... నేటి పోటీ ప్రపంచంలో.... పిల్లలను చదువుల జైళ్ళలోకి ముక్కు పచ్చలారక ముందే తోసేస్తున్నారు.చదువే లోకంగా, మార్కులే కొలబద్దగా, ర్యాంకులే జీవితాలగా చెప్పి.... పిల్లలను పోటీ లోకి దించి వారి బాల్య జీవిత మాధుర్యాన్ని వేస్తున్నారు.
పాత రోజుల్లో అమ్మమ్మలు , నానమ్మలు, తాతయ్యలు ఆరు బయట వెన్నెల్లో చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని.... చందమామను, తళుకుబెళుకు నక్షత్రాలను చూపుతూ.... ఎన్నో అద్భుతమైన కధలు చెప్పేవారు. అనగనగా.... ఒకరాజంటూ .... ఉత్సాహవంతమైన రాజకుమారుల కధలు, మాయలు మంత్రాల కధలూ. నీతికధలు, పేదరాసి పెద్దమ్మ కధలు, సాహస వీరుల కధలు, రామాయణ మహాభారతం కధలు......ఇలా ఒక్కటేమిటి... పిల్లలకు తమ భావిజీవితాలకు అవసరమైన ఎన్నో... ఎన్నెన్నో మంచి విషయాలను కధల రూపంలో చెప్పేవారు. అలాంటి ఉన్నతమైన భావాలను కధారూపంలో విన్న బాలలు తామూ అలా ఎదగాలని అప్పటినుండే తమ వ్యక్తిత్వాలకు మెరుగు దిద్దుకొనేవారు.
కథలంటె ఇష్టపడని పిల్లలుండరు. పిల్లల్లో నాటికీ, నేటికీ ఎలాంటి మార్పు లేదు. వచ్చిన మార్పల్ల పెద్దల్లోనే.... ! తమ పిల్లలు కథల పట్ల ఆకర్షితులైతే చదువుల పట్ల ఆసక్తి తగ్గిపోతుందనే .... నేటి తల్లిదంద్రుల ఆలొచలనల కారణంగానే ఈ కాలపు పిల్లలు కథలలోని మాధుర్యాన్ని పొందలేక పోతున్నారు. మూడేళ్ళు నిండక ముందే... టై, యూనిఫాంలతో వారి బాల్యాన్ని బందించి... కాన్వెంట్లనబడే ... జైళ్ళలోకి బలవంతంగా తోసేస్తున్నారు.
అయితే.. కథలు వినటం, చదవటం మూలాన వారు ఆయా రంగాల్లో నిష్ణాతుల కాలేరు అనటం భావ్యం కాదు.
చిన్నప్పుడు పిల్లలు ఏకాగ్రతతో కథలు వింటారు. కథలోని ప్రతి సన్నివేశాన్ని చక్కగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. అందులోని సారాంశాన్ని తమదైన రీతిలో విశ్లేషించుకొంటారు. మధ్యమధ్యలో తమకు వచ్చిన అనుమానాలను పశ్నల ద్వారా నివృత్తి చేసుకొంటారు. కథలు విని తామూ కొత్త కొత్త కథలకు రూపకల్పన చెయడానికి ప్రయత్నిస్తారు.
ఇలా వారిలో పసితనంలోనే... ఏకాగ్రత, చక్కగా వినగలగటం, విన్నదానిని అర్ధం చేసుకొనే విధానం , అందులోని సారాంశాన్ని విశ్లేషించుకోవటం, అవసరమైన చోట తమకు వచ్చిన అనుమానాలు తీర్చుకోడానికి ప్రశ్నలు అడగడం... , కొత్త అంశాల అన్వేషణ... ఇక్కడనుండే అలవడతాయి. ఇది వారి భావి విద్యకు చక్కగా ఉపయోగ పడుతుందనడంలో సందేహం లేదు.
సమకాలీన వాతావరణం, పెరిగిన పిల్లల మానసిక స్థితి, కథలలో కొత్తదనం కావాలనుకోవటం.. , కథల్లో ఆసక్తి కలిగి వుండటం... లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి.
పిల్లలకు సరికొత్త కథలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పురాణ ఇతిహాసాలానూ ; గాంధీజీ, నెహ్రూ, నేతాజీ ల వంటి మహాపురుషుల గురించి ; శివాజీ, ఝాన్సీ రాణి వంటి వీరగాధలు; సింద్ బాద్ సాహస గాధలు ; తెనాలి రామకృష్ణుడు, పరమానందయ్య శిష్యుల వంటి హాస్య కథలు...చెప్పండి. సత్యం , ధర్మం, నీతి , న్యాయం కొసం జీవితాలను త్యాగంచేసిన మహానుభావులగురించి తెలియజేయండి. వారి గాధలు ఆదర్శంగా తీసుకొనేలా ప్రోత్సహించండి.
తల్లులూ... తండ్రులూ ముందు మీరు చక్కటి కథలు నేర్చుకోండి. పిల్లలకు చక్కటి కథలను చెప్పండి. వారి చేత మంచి కథలను చదివించండి. వారిచేత చక్కటి కథలను చెప్పించండి. వారికి కథల కరువును తేకండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|