రామానాయుడులో కొత్తకోర్సులు
రామానాయుడు ఫిలిం స్కూల్ లో రెండో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఈసారి కొత్తగా సినిమాటోగ్రఫీ కోర్సును ప్రవేశపెట్టినట్టు డి.సురేష్ బాబు తెలిపారు. రామానాయుడు ఫిలిం స్కూలులో సోమవారం ఆయన ఆ వివరాలను తెలియజేశారు.
ఫిలిం స్కూలును గత ఏడాది అక్టోబర్ 9న ప్రారంభించామనీ, తొలుత డైరెక్షన్, స్క్రిప్ట్ కోర్టులు మొదలుపెట్టి 30 మంది విద్యార్థులతో 15 నెలల కాలవ్యవధితో కోర్సు ప్రారంభించామన్నారు. ఈ ఏడాది రెండో బ్యాచ్ ను మొదలుపెడుతున్నట్టు చెప్పారు. కొత్తగా సినిమాటోగ్రఫీ కోర్సు కూడా చేర్చామని తెలిపారు. రెండో బ్యాచ్ దరఖాస్తులను ఈనెల 22వ తేదీలోగా దాఖలు చేయాలని ఆయన కోరారు. వచ్చే ఆగస్టు నుంచి యాక్టింగ్ తదితర కోర్సులు కూడా ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవల డాక్టర్ దాసరి నారాయణరావు గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారనీ, త్వరలోనే కె.రాఘువేంద్రరావు సైతం గెస్ట్ లెక్చర్స్ ఇవ్వనున్నారనీ వెల్లడించారు. తమ స్టూడియోలోని ఎక్విప్ మెంట్ విద్యార్థుల శిక్షణకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రతిభా పాటవాలు ఉన్న విద్యార్థులకు తమ సంస్థ లో పనిచేసే అవకాశాలు కల్పిస్తామనీ, అలాగే పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందిస్తామనీ చెప్పారు. కొత్త బ్యాచ్ లో జాయిన్ కావాలనుకునే వారు రామానాయుడు ఫిలిం స్కూల్ అఫీషియల్ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
Be first to comment on this News / Article!
|