'మగధీర' ఐటెంగాళ్ కు పెళ్లి
'ఏం పిల్లడో ఎల్దామొస్తవా' అంటూ 'మగధీర' చిత్రంలో తన డాన్సింగ్స్ స్కిల్స్ తో యువతను ఉర్రూతలూగించిన కిమ్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటల మీద కూర్చోనుంది. స్పానిష్ ప్రొఫెషనల్ సింగర్ కార్లోస్ మారిన్ తో కిమ్ శర్మ పెళ్లి జరుగనుందని సినీ విశ్వసనీయ వర్గాల సమాచారం. మోడలింగ్ నుంచి నటిగా మారిన కిమ్ శర్మ 'మొహబ్బతే' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 'ఫిదా', 'హే బేబీ' వంటి పలు చిత్రాల్లో నటించింది. 'ఖడ్గం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కిమ్ ఇటీవల రవితేజ 'ఆంజనేయులు' చిత్రంలో కూడా ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. నవదీప్, భూమిక జంటగా విడుదలకు సిద్ధమవుతున్న 'యాగం' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది.
క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కిమ్ శర్మ ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చినా ఆ వ్యవహారం సద్దుమణిగింది. కొద్దికాలంగా కార్లోస్ మారిన్ తో డేటింగ్ చేస్తోందని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరూ పెళ్లితో స్థిరపడాలని నిశ్చయించుకున్నారని సమచారం. కిమ్ సైతం తన కెరీర్ కంటే కార్లోస్ కెరీర్ ఉజ్వలంగా ఉండటంతో పెళ్లి ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కార్లోస్ మంచి గాయకుడే కాకుండా పాప్ మ్యూజికల్ క్వార్టెర్ 2-డివో సభ్యుడు కూడా. వివాహానంతరం స్పెయిన్ లో నే స్థిరపడాలని కిమ్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే కిమ్ మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. తన సన్నిహిత మిత్రులకు మాత్రమే పెళ్లి వార్తను తెలియజేసిందనీ, తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకునేందుకు తరచు ముంబై టు మాడ్రిడ్ కు చక్కర్లు కొడుతోందనీ తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|