'యంగ్ ఇండియా' పిలుస్తోంది
బహుముఖ ప్రజ్ఞాశాలి, శతాధిక చిత్రాల దర్శకుడిగా గిన్సెస్ లో చోటు సంపాదించుకున్న దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో 149వ చిత్రంగా 'యంగ్ ఇండియా'ను త్వరలో తెరకెక్కించనున్నారు. ఇందుకోసం కొత్త నటీనటుల బయోడాటాలను ఆయన ఆహ్వానించారు. నూతన తారల నుంచి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందనీ, తనతో పాటు తన శిష్యులైన పలువురు దర్శకులను సైతం ఈ స్పందన ఆశ్చర్యంలో ముంచెత్తుతోందనీ దాసరి తెలిపారు. కేవలం వారం రోజుల గడువు ఇస్తే 15 వేలకు పైగా ఫోటా బయోడాటాలు వచ్చాయనీ, మరో ఆరేడు బ్యాగ్ లను ఇంకా తెరవాల్సి ఉందనీ ఆయన చెప్పారు. గురువారంనాడు తన నివాసంలో మీడియాతో దాసరి ముచ్చటించారు.
వర్షాలు, పండుగల కారణంగా తమ బయోడాటాలు పంపేందుకు గడువు చాలలేదనీ, మరికొంత సమయం కావాలనీ నూతన తారలెందరో కోరుతున్నారనీ, వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 7 వరకూ గడువు ఇస్తున్నామనీ ఆయన తెలిపారు. ఈ చిత్రం కోసం 55 నుంచి 60 మంది నూతన తారలను ఎంపిక చేస్తామనీ, ప్రతిభ మినహాయిస్తే సిఫారసులకు తావు లేదని స్పష్టం చేశారు. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లు, ఇద్దరు సైడ్ హీరోయిన్లు, ఇతర పాత్రలకు కొత్తవారిని ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఎంపికైన వారికి తమ సొంత ఖర్చులతో శిక్షణ ఇస్తామనీ, ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు మాత్రం సీనియర్లే ఉంటారనీ తెలిపారు. దర్శకుడిగా ఐదారేళ్లు గ్యాప్ తీసుకున్నాననీ, తమ చిత్రాలకు దర్శకత్వం వహించమని పలు సంస్థలు తనను సంప్రదించాయనీ అన్నారు. అయితే తన దర్శకత్వంలో వచ్చే 149వ సినిమా కోసం మూడు నాలుగు నెలలు వెచ్చించి స్వదస్తూరితో స్క్రిప్టు తయారు చేశానని చెప్పారు. నేటి యువతకు కర్తవ్యాన్ని నిర్దేశించే విధంగా కథ ఉంటుందన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. గురువుగారు దాసరి ఏ పని చేపట్టినా ఛాలెంజింగ్ గా తీసుకుంటారనీ, ఎందరెందరో కొత్తవారిని పరిశ్రమకు అందించిన ఘనత ఆయనదేననీ ఇదే సమావేశంలో పాల్గొన్న కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, పినిశెట్టి రవిరాజా, సంజీవి, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు పేర్కొన్నారు. నిర్మాత రామకృష్ణ ప్రసాద్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|