'స'మ్మోహనదాస్
మలయాళం నుంచి తెలుగులోకి అడుగుపెట్టి హీరోలకు తగిన ఒడ్డూ, పొడుగు ఉన్న హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ మంచి అవకాశాలే అందిపుచ్చుకుంది. 'రాఖీ రాఖీ నా కవ్వాసాకి', 'ఆకలేస్తే అన్నం పెడతా' అంటూ గాయనిగా కూడా యువతను ఉర్రూతలూగించింది. అయితే గాయనిగా కంటే హీరోయిన్ నటించడానికే ఎక్కువ ఇష్టపడే ఆమెకు సోలో హీరోయిన్ గా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. 'కృష్ణార్జున' చిత్రం ఫ్లాప్ కావడంతో 'యమదొంగ', 'చింతకాయల రవి' చిత్రాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలను పోషించి తన సత్తా చాటుకుంది. నాగార్జున 'కింగ్' చిత్రంలోనూ సెకెండ్ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం విజయవంతమైనా తన పాత్రను కుదించారంటూ మమత ఆమధ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత డజనుకు పైగా సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె నిరాకరిస్తూ వచ్చారు. అనూహ్యంగా ఇప్పుడు నాగార్జున సరసనే 'రమ్మీ' చిత్రంలో సోలో హీరోయిన్ గా నటించే సువర్ణావకాశాన్ని ఆమె దక్కించుకుంది. ఒక అగ్రహీరో సరసన మెయిన్ హీరోయిన్ గా మమత నటిస్తుండటం ఇదే ప్రథమం.
'రమ్మీ' చిత్రం డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండటంతో మమత తన తదుపరి ప్రాజెక్ట్ ల వైపు కూడా దృష్టిపెడుతోంది. ప్రస్తుతం మలయాళంలో కూడా ఆమె ఓ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ పై కూడా ఆమె కన్నేసింది. ఇటీవలే ముంబైలో ఓ ఫోటో సెషన్ కు కూడా హాజరైందనీ, త్వరలోనే ఆమె హిందీలోకి కూడా అడుగుపెట్టనుందనీ తెలుస్తోంది. మమత ఈ విషయమై ఆచితూచి మాట్లాడుతున్నప్పటికీ హిందీలోకి వెళ్లే అవకాశాలను మాత్రం తోసిపుచ్చడం లేదు. ఈరోజు (14) మమత పుట్టినరోజు కూడా. 'రమ్మీ' మంచి సక్సెస్ సాధించి హిందీలోకి అడుగుపెట్టాలనే మమత కోరిక కూడా నెరవేరుతుందని ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|