TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
తెలుగు భాషకు భూషణం
- Site Administrator
  Page: 1 of 3   Next > >  
(ఆర్వీయస్ సుందరం) కొన్ని భాషలు పుట్టి పెరిగిన తర్వాత పరిమిత ప్రయోజనాలనే సాధిస్తూ కేవలం వ్యవహార భాషలుగా ఉంటాయి. మరి కొన్ని భాషలు వ్యవహార భాషలుగా అనేక ప్రదేశాలలో వైవిధ్యమయంగా అభివృద్ధిని సాధించడంతో పాటు భాష ఎంత సామర్ధ్యం కలదో నిరూపించే విధంగా పెంపొందుతాయి. అలా అభివృద్ధి చెందిన భాషలలో తెలుగు కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. సొంతమైన గట్టి పదజాలాన్ని ఉపయోగించడంతో పాటు ఇరుగు పొరుగు భాషల నుండి కూడా పదాలను స్వీకరించి, అలవాటు చేసుకొని ఒక భాషను ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో నిరూపించిన భాష కూడా తెలుగే. తెలుగు సాహిత్యం గురించి, భాషా వికాసం గురించి రాసే వారు నన్నయ్యతో మొదలుపెట్టి నారాయణరెడ్డి వరకు సాధించిన విజయాలను వివరిస్తుంటారు. కవిత్రయం, శ్రీనాధుడు, ప్రబంధ కవులు, ఆధునిక సాహిత్యం ఇవే సాహిత్య చరిత్రకారుల్ని ఆకర్షించే విషయాలు. తెలుగువారి సామాజిక స్పృహకు శ్రీకారం చుట్టిన వేమన లాంటి వారిని సాహిత్య చరిత్ర నుండి బహిష్కరించిన వారున్నారు. తెలుగు భాష, సంస్కృతి, ఛందో వైవిధ్యం, తెలుగుదనానికి ప్రతీక అయిన జానపద సాహిత్యం - ఇవేవీ సాహిత్య చరిత్రకారుల పరిగణనలోకి రావు. తెలుగు సాహిత్యంలోని మూల సత్త్వాన్ని నిరూపించే జానపద సాహిత్యానికి సాహిత్య చరిత్రల్లో స్థానమే లేదు. తెలుగు భాష సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోగోరే వారు ఇవన్నీ గమనించాల్సి ఉంది. తెలుగులో అప్రధాన కవులుగా సాహిత్య చరిత్రకారులు భావించిన రేచన, కేతన, కొరవి గోపరాజు, పాల్కురికి సోమనాధుడు, అన్నమయ్య, వేమన, క్షేత్రయ్య, త్యాగయ్య లాంటి వారినే ప్రధానంగా తీసుకొని, ప్రపంచంలోనే అనితర సాధ్యమైన తెలుగు వీరగాథల లాంటివి చేర్చి తెలుగు సాహిత్య వికాసాన్ని తెలియజేస్తే తెలుగు బలమేమిటో తెలుస్తుంది. రేచన, కేతన, వేమన, అన్నమయ్య లాంటి వారిని నేనెక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే తెలుగు భాషకు వీళ్ళు ఇతరుల కంటే భిన్నంగా విశిష్టమైన సేవ చేశారు. తెలుగు భాష లోతుల్లోకి వెళ్ళారు. తెలుగువారు కూడా స్వతంత్రంగా ఆలోచించగలరని నిరూపించారు. కేతన మనం గర్వంగా చెప్పుకోదగిన కవి. మహాకవి తిక్కన ప్రశంసలందుకున్నవాడు. పదమూడవ శతాబ్దిలోనే తెలుగును రకరకాలుగా ఉపయోగించవచ్చని తన రచనల ద్వారా తెలియజెప్పిన వాడు. బుధజనములు ఇతనిని 'అభినవ దండి' అని ప్రశంసించారు. సంస్కృతంలో దండి మహాకవి, గొప్ప అలంకారికుడు. దాక్షిణాత్యుడు. కన్నడంలో దొరికిన రచనల్లో మొదటిదైన కవిరాజమార్గం దండి కావ్యాదర్శన్ని అనుసరించి రాసిన లక్షణగ్రంథం (9వ శతాబ్ది). నన్నెచోడుడు కుమార సంభవంలో దండి చెప్పిన 36 అలంకారాలనే చెప్పాడు. తమిళంలో దండి అలంకారం అనే గ్రంథముంది, దండి రాసిన దశకుమార చరిత్ర అనే గద్య కావ్యాన్ని కేతన చంపూ కావ్యంగా తెలుగులో రాశాడు. ఇది తెలుగులో కథాకావ్యాలకే మార్గదర్శకమైంది. దశకుమార చరిత్రను రాసి తిక్కన మహాకవినే మెప్పించిన కవి కేతన.

Read 2 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 3   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.