TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
'కాపీ'కి 'రైటు' లేదు!
- Editor
< < Previous   Page: 2 of 2    
ఇక హక్కు పొందే రచయిత ఎవరనే విషయానికొస్తే సాహిత్యం, డ్రామా విషయాల్లో వివాదం వుండదు. కాని సంగీతం విషయంలో ఎవరైతే సంగీతాన్ని సమకూరుస్తారో వారు స్వంతదారులవుతారు. వారి కూర్పును రచించనవసరం లేదు. చలనచిత్రాల విషయంలో నిర్మాతలు స్వంతదారులవుతారు. వారు వ్యక్తులవ్వొచ్చు లేదా చట్టం ద్వారా వ్యక్తులుగా గుర్తింపుపొందిన వారవ్వొచ్చు. అలాగే ఒక చిత్రకారుడి చేత తగిన ప్రతిఫలం ఇచ్చి చిత్రం వేయించుకుంటే ప్రతిఫలం ముట్టచెప్పినవారు స్వంతదారులవుతారు. వార్తాపత్రికలు, ఇతర పత్రికల్లో పనిచేసేవారు వ్రాసిన రచనలు, ఆ పత్రికల్లోని ప్రచురణల వరకు ప్రచురణ కర్తకు చెందుతాయి. ఎవరైనా ఉపన్యాసమిచ్చినా, వారి ఉపన్యాస సారాంశాన్ని వేరొకరు చదివినా, అది ఎవరు వ్రాసినా ఎవరైతే ఉపన్యసిస్తారో వారే స్వంతదారులవుతారు. ఒక సంస్థ క్రింద పనిచేసే వారు ఏదైనా రచన చేసినట్టయితే ఆ సంస్థ స్వంతదారవడం జరుగుతుంది. ఇలా ఏ వ్యక్తికీ స్వంతంకాని కళారూపాలు కొన్ని వుంటాయి. వాటిని ప్రజాబాహుళ్యానికి చెందినవిగా గుర్తిస్తారు. మనకున్న జానపద సంస్కృతీ సంపద, కాపీరైటు కాలం పూర్తయిన రచనలు ఈ కోవలోకే చెందుతాయి. మనదేశంలో రచయిత మరణించిన తర్వాత నుండి 60 సంవత్సరాలపాటు కాపీరైటు అమలులో వుంటుంది. ఈ కాలాన్ని రచయిత మరణించిన తేదీనుండి కాక తదుపరి వచ్చే జనవరి నెల 1వ తేదీనుండి పరిగణనలోకి తీసుకుంటారు. జంట రచయితల విషయంలోనైతే చివరగా ఎవరు మరణిస్తారో వారి తేదీ నుండి లెక్కిస్తారు. అజ్ఞాత రచయితల రచలన విషయంలోనైతే అవి ముద్రించిన నాటి నుండి 60 సంవత్సరాలపాటు కాపీరైటు అమలులో వుంటుంది. కాపీరైటును రెండు రకాలుగా గుర్తించారు. 1.ఆర్తిక హక్కులు, 2. నైతిక హక్కులు. తన రచనని ఏ రూపంలోనైనా మార్చుకోవడానికి, ప్రజాబాహుళ్యాికి తెలియచేసుకోవడానికి వుండే హక్కుల్ని ఆర్థిక హక్కులంటారు. అదే విధంగా రచయిత పేరుని తగిన విధంగా తెలియచేసుకోవడం, తన రచనని తన గౌరవానికి విరుద్ధంగా వాడకుండా చేసుకోవడం రచయిత నైతిక హక్కుల క్రిందకి వస్తాయి. ఇటువంటి హక్కులకి కొన్ని మినహాయింపులు కూడా వున్నాయి. ఒక రచయిత వేరొక రచయిత రచనలోని భాగాల్ని తన రచనలో వినియోగించుకోవడం, పేరడీ ప్రక్రియ, పరిశోధన, విమర్స లేక వాస్తవ పరిస్థితుల్ని తెలియచేయడం, వ్యక్తిగత వినియోగానికి కంప్యూటర్ ప్రోగ్రామ్ లను కాపీ చేసుకోవడం, న్యాయస్థానాలకు, శాసనసభల వినియోగానికి ముద్రించడం, చట్టాల్ని తగిన వ్యాఖ్యానాలతో ముద్రించడం, నోటిఫికేషన్ల ముద్రణ మరియు కొన్ని సందర్భాల్లో విద్యాసంస్థల్లో వినియోగం, ఈ మినహాయింపుల క్రిందకి వస్తాయి. #tMulti కాపీ రైటును తగిన లిఖిత పత్రం ద్వారా దఖలు చేయవచ్చు. దఖలు చేసిన హక్కుల్ని వేరే విధంగా పేర్కొనకపోతే ఒక సంవత్సరం లోపు వినియోగించుకోవలసి వుంటుంది. ప్రాంతం గురించి పేర్కొనకపోతే మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. దఖలు ద్వారా వివిధ హక్కుల్ని వేర్వేరు వ్యక్తులకు దఖలు చేయవచ్చు. దీనిపై వ్యాజ్యాన్ని కాపీరైటు బోర్డు పరిష్కరిస్తుంది. రచయిత తమ కాపీరైటు హక్కును మిగిలిన స్థిరాస్థుల్లా వీలునామా ద్వారా బదిలీచేయవచ్చు. ఈ విధంగానే కాకుండా రచయిత అనుమతులు కూడా మంజూరు చేయవచ్చు. అటువంటి అనుమతులు వేరే విధంగా పేర్కొనకపోతే ఒక సంవత్సరం పాటు అమలులో వుంటాయి. అంతేకాకుండా చట్టప్రకారం నిర్బంధ అనుమతులు కాపీరైటు బోర్డు మంజూరు చేయవచ్చు. గతంలో ముద్రించబడి లభ్యంకాని రచనల విషయంలో కాని, సాహిత్యానికి లేక డ్రామాల విషయంలో వాటి అనువాదాల ముద్రణ కోసం, సాహిత్య, సాంకేతిక కళారూపాల, ధ్వని రికార్డుల ముద్రణ కోసం అటువంటి నిర్బంధ అనుమతులు మంజూరు చేయవచ్చు. ఏదైనా రచన కాని, కళారూపం కాని ఆకృతి పొందిన వెంటనే కాపీరైటుకు అర్హత వస్తుంది. దానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఏమీ అవసరం లేదు. కాని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే సాక్ష్యంగా వుపయోగపడుతుంది. కాపీరైటు ఉల్లంఘనకి పరీక్ష ఏమంటే, ఒక సాధారణ వ్యక్తి రెండు రచనల్ని కాని, కళారూపాల్ని కాని చూసిన తర్వాత ఒకటి రెండవదానికి కాపీ అని భావిస్తే అది ఉల్లంఘన క్రిందకి వస్తుంది. ఒక రచనకి వస్తువు ఒకటే అయ్యి దాన్ని వాడుకున్న పద్ధతి వేరైనపుడు అది ఉల్లంఘన క్రిందికి రాదు. ఉల్లంఘన జరిగినట్టు ఆరోపించినపుడు గట్టి సాక్ష్యాధారాలు చూపించాల్సి వుంటుంది. ఉల్లంఘనకి కనీసం ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 50,000 రూ..లకు తగ్గకుండా రెండు లక్షల వరకు అపరాధ రుసుము చెల్లించేటట్టు శిక్ష వేయవచ్చు. ఇంటర్నెట్ వినియోగంలో కాపీరైటు చట్టమే కాకుండా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అమలవుతుంది. అంతర్జాతీయంగా బెర్నె, కన్వెన్షన్, ట్రిప్స్ అగ్రిమెంటు, యునెస్కో ఆధ్వర్యంలోని యూనివర్శల్ కాపీరైటు కన్వెన్షన్ వంటి ఒప్పందాలకు మనదేసం ఒప్పుకొని వుంది. కాని అంతర్జాతీయ ఒప్పందాలు వాటంతట అవే మనదేశంలో అమలు కావు. అందువల్లనే అవసరమైనప్పుడల్లా కాపీరైట్ చట్టం, 1957కు సవరణలు చేయడం జరుగుతోంది. 1709లో ఇంగ్లండులో వచ్చిన కాపీరైటు చట్టానికి మూడువందల సంవత్సరాలు నిండుతున్నాయి. కాని ప్రభుత్వాలు కాపీరైటు ఉల్లంఘన జరగకుండా యింకా పటిష్టమైన చర్యలు తీసుకోవలసిన అవసరం వుంది. పైరసీ సి.డి.ల విషయంలో చలన చిత్ర పరిశ్రమ దానంతట అదే ప్రజల్ని జాగృతం చేసి ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేటట్టు చేస్తోంది. అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన పుస్తకాల విషయంలో, సాఫ్ట్వేర్ విషయంలో విచ్చలవిడిగా పైరసీ కొనసాగుతూనే వుంది.

Read 2 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 2 of 2    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.