|
|
Articles: My Thoughts | పై వాడున్నాడు... - Site Administrator
| |
ఇటీవల హంగేరీలోని ఓ చర్చిలో మేరిమాత విగ్రహం నుంచి కాంతి పుంజాలు వెలువడ్డాయి. ఇటువంటి ఉదంతాలకు శాస్త్రబద్ధమైన వివరణలు వున్నప్పటికీ భగవంతుడి మీద భక్తుల విశ్వాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సన్నగిల్లదు. మానవాతీతమైన దైవశక్తి అన్ని మతాల్లోనూ కనిపిస్తుంది. హిందు పురాణాల్లో భగవంతుడి శక్తిని చాటి చెప్పే ఇతిహాసాలు అనేకం వున్నాయి. శ్రీ కృష్ణుడు బాల్యంలోనే రాక్షసులను వధించడం, హనుమంతుడు సూర్యుడిని పండుగా భావించి మింగేయడం వంటి దైవ విన్యాసాలను పురాణాలలో చదివాం. షిర్డిసాయి బాబా, ప్రభు చైతన్య వంటి పురాణ పురుషుల అద్భుత శక్తులు గురించి తెలియని భక్తులు లేరు. షిర్డీ సమీపంలోని ఓ గ్రామంలో కాలిపోతున్న ఇంట్లో ఒక బాలుడు చిక్కుకుపోయిన విషయాన్ని సాయిబాబా తన దివ్య దృష్టిద్వారా తెలుసుకుని మండుతున్న కుంపట్లో చెయ్యి పెట్టి 'దేవుడా ఆ బాలుడిని కాపాడు' అని గట్టిగా అరిచాడట. అంతే ఆ బాలుడు చిన్న దెబ్బకూడా తగలకుండా మంటల్లోంచి సురక్షితంగా బయట పడ్డాడు. అస్వస్థతకు, ఇబ్బందులకు గురైన భక్తులు బాబా విభూది ధరించి స్వస్థత పొందుతున్నారు.
గత శతాబ్ధంలో, 1995 సెప్టెంబర్ 21న అనేక దేవాలయాల్లో వినాయకుడి విగ్రహాలు పాలు తాగిన సంఘటనలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఓ దేవాలయంలో గణపతి, విగ్రహానికి సమర్పించిన పాలు, ఆ విగ్రహం తాగేసినట్టుగా, అదృశ్యం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలలో భక్తులు పాలు పట్టుకెళ్ళి బారులు తీరిన సంగతి తెలిసిందే. విగ్రహాలకు గల సూక్ష్మమైన రంధ్రాల ద్వారా పాలు ఇంకిపోయాయని శాస్త్రవేత్తలు ఇచ్చిన వివరణలను భక్తులెవరూ పట్టించుకోలేదు. విశ్వాసం సాకారం పొందడమే అద్భుతం అంటారు పండిట్ కేదార్ నాథ్ శాస్త్రి అనే పూజారి. దేవుడి ఉనికిని చాటి చెప్పేందుకు అద్భుతాలు కాని, మరోరకమైన సాక్ష్యాధారాలు కాని అవసరం లేదంటారాయన. అయితే విశ్వాసానికి మరింత బలం చేకూర్చడానికి అవిదోహద పడతాయి. మతం శాస్త్ర విజ్ఞానం కంటె పురాతనమైనది. శాస్త్రం కంటే శక్తివంతమైనది. ఆ మతాలు ఘోషించే అద్భుతాలు సైన్సును తోసిరాజని, దైవమనే మానవాతీత శక్తి ఉనికి గురించి చాటి చెపుతున్నాయి.
మహమ్మదు ప్రవక్త తాను సృష్టించిన అద్భుతం ఖురాన్ అనీ, దైవలీలలు అల్లా సొంతమనీ చెప్పాడు. సముద్ర జలాల మీద, ఆకాశం మీద, ఫలాల మీద అరబిక్ భాషలో అల్లా పేరు ఎన్నో సార్లు దర్శనమిచ్చింది. ముస్లింలకు చిహ్నమైన నెలవంకను సృష్టించడానికి మహ్మద్ ప్రవక్త చంద్రుడిని రెండుగా చీల్చాడట. హజ్రత్ మూసా అనే ప్రవక్త ఎర్ర సముద్రాన్ని రెండుగా విభజించాడట. ఇదే విషయాన్ని బైబిల్ కూడా పేర్కొంది. సూఫీ సన్యాసులు అనేక మందికి మానవాతీత శక్తులు వుండేవని ఖురాన్ చెబుతోంది. నిజాముద్దీన్ ఔలియా తన హత్యకు కుట్ర పన్నిన ఢిల్లీ సుల్తాను ఘియాసుద్దీన్ తుగ్లగ్ ను తన అద్భుతశక్తితో అంతమొందించాక, తుగ్లకాబాద్ కు శిథిల నిర్మానుష్య నగరంగా కొనసాగమని శాపమిచ్చాడు. ఆ పట్టణం పరిస్థితి ప్రస్తుతం అదే! రెండేళ్ల క్రితం మన దేశంలో మరో అద్భుతం జరిగింది. ముంబయిలోని ఒక ముస్లిం దర్గా చుట్టూ వున్న కలుషిత చెరువులోని నీరు అకస్మాత్తుగా తియ్యగా మారిపోయింది. అల్లా లీలగా దీనిని భావించిన ప్రజలు ఆ నీటిని తాగడం తోపాటు సీసాలతో పట్టుకు పోయి చిన్నపిల్లలకు కూడా పట్టారు. కాలుష్య భరితమైన ఆ చెరువు నీటిని తాగకూడదని తెలిసి కూడా భగవంతుడి మీద విశ్వాసంతో వారు దానిని పవిత్ర జలంగా భావించి సేవించారు. నానాటికీ నాస్తికుల సంఖ్య పెరిగిపోతున్న ఈ ఆధునిక యుగంలో తరచు ఇటువంటి అద్భుతాలు జరగడం ఆశ్చర్యకరం.
మరోవైపు మానవాతీత శక్తుల పేరిట ఎంతో మంది బూటకపు సన్యాసులు, బాబాలు సొమ్ము చేసుకుంటున్నారు. వీరిలో చాలా మంది మోసాలు బయటపడిపోయి దేహశుద్ధి చేయించుకుంటున్నారు. మతం సత్యానికి ప్రతీక. దానిలో కల్లలకు, అవాస్తవాలకు తావులేదు. దేవుడు ఉన్నాడని రుజువు చెయ్యడానికి అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. సుప్రసిద్ధ సిద్ధాంతకర్త ఫాదర్ జార్జి గిస్పర్ట్, సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్ అధిపతి ఫాదర్ విక్టర్ డిసౌజా చెప్పినట్లు దేవుడు అంతటా వున్నాడు. ప్రతిమనిషిలో, ప్రతి వస్తువులో వున్నాడు. ప్రతిమనిషి జీవితం అద్భుతం. భగవంతునితో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడమే అద్భుతం. ప్రకృతిలో చోటు చేసుకొనే పరిణామాలు, ప్రతికూల పరిస్థితుల్లో మనం కూడగట్టుకునే మనోస్థైర్యం, కష్టాలను ఎదుర్కోవడానికి పోగు జేసుకునే ఆత్మబలం... ఇవే దేవుడు మనపై ప్రయోగించే అద్భుతాలు. అన్నింటినీ మించిన దైవలీల, దేవుడు మనకు ఇచ్చిన అద్భుతమైన వరం ప్రేమ. దానిని అందరికీ పంచిపెట్టి, ఆ మానవాతీత శక్తిలో ఐక్యం కావడమే పరమాద్భుతం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|