|
|
|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
30వ అధ్యాయం
కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి
నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూతమహాముని చెప్పిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రులను విని ఆనందించి, వేనోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకా సంశయములు తీరకపోవడంతో సూతిని గాంచి ఓ మునోత్తమా! కలియుగమందు ప్రజలు మాయామోహములకు దాసులై జీవిస్తూ సంసారసాగరం తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా తరించు తరుణోపాయం ఏదైనా ఉందా? ధర్మములన్నింటిలో అజ్ఞానాన్ని తొలగించి, మోక్షసాధనకు ఉపకరించు ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము. కావున దీనిని వివరించి చెప్పమని కోరెను.
అంత సూతుడాప్రశ్న విని ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోదగినవి. కలియుగములో మానవులు మంబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్షదాయకము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు చేసినా పుణ్యము దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ఎంతో ఇష్టమైనది. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి తెలిపియున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాక, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునకు కూడా శక్యము కాదు. అయినా సూక్ష్మముగా వివరించెదను.
కార్తీక మాసములో ఆచరించవలసిన పద్ధతులు చెప్తున్నాను శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు, మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దానిలో కొంచెమైనా దీపదానము చేయాలి. ప్రతిరోజూ పురాణాన్ని చదవాలి. పరనిందారోపణ చేయకూడదు. ఉన్నంతంలో దానం చేయాలి. ఇలా చేసినచో ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠాన్ని చేరుకుంటారు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది. ఈనెల హరిహరాదులకు ఎంతో ఇష్టమైనది. కనుక కార్తీక వ్రతమును జన్మజన్మల నుండి వారికి ఉన్న సకల పాపాలు హరించి, మరుజన్మ లేక వైకుంఠము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలన్న కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్నా, కార్తీక వ్రతమన్నా అసహనం కలుగుతుంది.
కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకార్యములు చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులూ చేయలేనివారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానం కలుగును. ఈనెలలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించును. ఈ నెలరోజులూ ధనవంతుడైనా, బీదవాడైనా, మరెవ్వరైనా సరే హరినామస్మరణ చేస్తూ, పురాణములు వింటూ, పుణ్య తీర్థములు సేవిస్తూ, దానధర్మాలు చేసినవారికి పుణ్యలోకములు ప్రాప్తించును. ఈ కథను చదివిన వారికీ, విన్న వారికీ శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణంభవతు ఓం శాంతి శాంతి:
త్రింశాధ్యాయము ముప్పదవ (ఆఖరిరోజు) పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|