|
|
Articles: TP Features | తెలుగువారికి మూడు రాష్ట్రాలు - Site Administrator
| |
ఈ రాష్ట్రంలో ఒక సాధారణ పౌరుడు జీవితమంతా కష్టపడితే ఇరవై అయిదు లక్షల రూపాయలు మాత్రమే సంపాదించగలడన్నది శాస్త్రీయ అంచనా. వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉన్న రాజకీయ నాయకులు రాష్ట్రంలో వెయ్యిమందికి పైగా ఉంటారు. ఇంత సంపద వారి వద్ద ఎలా సమకూరుతున్నది. వారి సంపాదనకు, అవినీతికి అంతం లేదా. వీరి అక్రమాల విషయమై సామాన్య జనానికి తెలియజెప్పడంలో మీడియా, అవినీతి నిరోధక శాఖ పూర్తిగా విఫలమయ్యాయి.
సరసాదేవి... ఎవరు ఆమె? డిపిఇపి అనే గ్రామీణ ప్రాంతాలలో పసిపిల్లల అభివృద్ధి విద్య కోసం పనిచేసే ప్రభుత్వ సంస్ధ ఒకటి ఉంది. ఈ సంస్థలోని ఏడు కోట్ల రూపాయల డబ్బులను ఆమె అక్రమంగా కొల్లగొట్టింది. ముఖ్యమంత్రి దగ్గర సేవకుడిగా ఉన్న ఒక కడప రెడ్డికి ఆమె స్నేహితురాలో, ఇంకేమో అవుతుంది. అంతమాత్రానికే ఆమె ఏడు కోట్లు కొల్లగొడితే అడిగే దిక్కులేదు. విచారించేవారు లేరు. అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రికి లేదా శాసనసభ్యులకు డబ్బులు కొల్లగొట్టడానికి ఎన్ని అవకాశాలుంటాయో సామాన్యులు ఆలోచించాలి. ఆ పసిపిల్లల డబ్బులు తింటే, తిన్నవారికి వారి ఉసురు తగలదా? ఇలాంటి ఎన్ని తప్పులు ఉపేక్షించినందుకే రాజశేఖరరెడ్డికి అంతటి ఆపద వచ్చి ఉంటుందని ధర్మాన్ని నమ్మే సామాన్యులు కొందరు అనుకున్నారు. నిజానికి ప్రతి ముఖ్యమంత్రి హయాంలో ఇలాంటి అవినీతి పనులు సాధారణంగా జరిగిపోతుంటాయి. రాజకీయ వాదులు ఆడే నాటకాలను, దొంగవేషాలను ప్రజలు జాగ్రత్తగా గమనించాలి.
రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు నాయుడు, రాజేశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వెంగళరావు తదితరుల కుటుంబాల ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో కర్ణాకర్ణిగా అందరికీ తెలిసిందే. అంత డబ్బు వారి దగ్గర ఎలా పోగవుతుంది. కోటి రూపాయలంటే నాలుగు కుటుంబాల జీవితకాలపు డబ్బు. ఇలా వీరి దగ్గర ఎన్ని వేల కుటుంబాల డబ్బు సమకూరింది. వీరిని ఎవరు ఆడిట్ చేయాలి? ఇలాంటి వారి విషయాలను ఎవరు పట్టించుకోవద్దు అంటే పెద్ద రాష్ట్రాలు ఉండాలి. ప్రజలు ఎవరి గొడవలో వారు ఉండాలి. వీరి చేతిలో అధికారం కేంద్రీకృతం కావాలి. అడిగేవాళ్ళందరి నోళ్ళు మూయించగలగాలి. ఇలాంటి అభివృద్ధి నిరోధకులు ప్రజల సొమ్ము దొంగిలించడానికి అలవాటుపడిన వారే చిన్న రాష్ట్రాలను వద్దంటున్నారు. ప్రజలు దీనిని గుర్తెరిగి చిన్న రాష్ట్రాలను స్వాగతించాలి. తెలుగువారికి రెండు మూడు రాష్ట్రాలు ఉండడంలో అనౌచిత్యం ఏమిలేదు. ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి రావడానికి పాస్ పోర్ట్ అవసరం లేదు. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్యోగాలు పొందడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎవరికి ఇష్టమైన చోట వారు ఉండవచ్చు. పొరుగు రాష్ట్రాలవారితో వియ్యమందవచ్చు. సోదర భావంతో ముందుకు కదలవచ్చు. అందరూ కలిసి అభివృద్ధి సాధించవచ్చు. ఇప్పుడైనా ఎప్పటికైనా చిన్న రాష్ట్రాలు అధికార వికేంద్రీకరణకు ప్రజలకు మేలు చేస్తాయి. దీనిని విజ్ఞత గల ప్రజలు స్వాగతించాల్సింది.
| Read 9 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|